పాక్ తో జ్యోతి.. లగ్జరీ లైఫ్ వెనుక అనుమానాలు?

ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కలకలం రేగింది. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్‌లో పాపులర్ అయిన ఆమెపై గూఢచర్యం ఆరోపణలు వచ్చినప్పటి నుంచి, ఆమె జీవనశైలి, విదేశీ పర్యటనలు పోలీసుల దృష్టిలోకి వచ్చాయి. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చినా… ఆమె ఖర్చుల స్థాయి మాత్రం ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రతిసారీ ఫస్ట్ క్లాస్ టికెట్లు, స్టార్ హోటళ్ల బస, విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ ఆమె వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో దర్యాప్తు కొనసాగుతోంది.

అతివేగంగా పాపులర్ అయిన ఆమె తరచూ పాకిస్థాన్ పర్యటనలు చేసినట్టు అధికారులు గుర్తించారు. పాక్ పర్యటనల అనంతరం చైనా, నేపాల్ వంటి దేశాలకు కూడా వెళ్లినట్లు రికార్డులు ఉన్నాయని సమాచారం. ఆమె ప్రయాణాల ఖర్చులన్నీ బయటి వర్గాలు భరిస్తున్నాయన్న అనుమానాలు పోలీసుల్లో నెలకొన్నాయి. ఆ మరుసటి దశలో ఆమె కశ్మీర్‌లో పర్యటించిన సమాచారం బయటికి రావడం మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ ఏడాది జనవరిలో జ్యోతి పహల్గామ్‌ వెళ్లిన మూడు నెలలకే అక్కడ ఉగ్రదాడి జరగడం పోలీసులకు దిశానిర్దేశం చేస్తోంది. అక్కడ ఆమె షూట్ చేసిన వీడియోలు, తీసిన ఫొటోలు ఎవరెవరి చేతికి వెళ్లాయన్నదానిపై అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలోని పాక్ ఎంబసీలో ఆమెకు సన్నిహితుడిగా భావిస్తున్న వ్యక్తి సందడి చేయడం, కేక్ తో వెళ్తూ కనిపించడమూ అనుమానాలకు దారితీస్తోంది.

జ్యోతి మల్హోత్రా పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో సంబంధాలు కొనసాగించిందని, వారిలో కొందరు విదేశీ వర్గాలతో సన్నిహితంగా ఉన్నట్టు సమాచారం. ఇన్‌ఫ్లుయెన్సర్లను వాడుకుని సమాచార ప్రసారం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభియోగాలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం పోలీసు అనుమానాలకే పరిమితం కావడం గమనార్హం. అధికారిక నిర్ధారణకు ముందు అభిప్రాయాలు ఇవ్వడం సమంజసం కాదని విచారణ చేపడుతున్న అధికారులు పేర్కొంటున్నారు.