బిగ్ బ్రేకింగ్: ఐపీఎల్‌కు బ్రేక్… బీసీసీఐ సంచలన నిర్ణయం

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు బీసీసీఐ అధికారి తెలిపారు. ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకుల భద్రతే ప్రథమం అన్న తత్వంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు వెల్లడించారు. ఇప్పటి వరకు అభిమానులు ఎదురుచూస్తున్న అన్ని మ్యాచ్‌లు నిలిచిపోవడం ఒక్కసారిగా క్రికెట్ లోకాన్ని షాక్‌కు గురిచేసింది.

గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న వాతావరణం క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపించడంలో ఇది తుది దశ. ధర్మశాలలో జరిగిన చివరి మ్యాచ్ మధ్యలోనే నిలిపివేయడం, అప్పటి నుంచి కొనసాగుతున్న భద్రతా చర్చలు చివరికి ఈ నిర్ణయానికి దారి తీసేశాయి. ఈ సందర్భంగా విదేశీ ఆటగాళ్లు, వారి బోర్డులు వ్యక్తం చేసిన భద్రతా ఆందోళనలు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి.

ఆర్థికంగా ఐపీఎల్‌కు తీరని దెబ్బే అయినా, దేశ భద్రతపై రాజీ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వం, భద్రతా విభాగాల నుంచి వచ్చిన సూచనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఐపీఎల్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.

క్రికెట్ అభిమానులు ఈ నిర్ణయంతో నిరాశ చెందడం సహజం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల ప్రాణాలకంటే, అభిమానుల భద్రతకంటే ఏ టోర్నీ పెద్దది కాదని వారంతా ఒకే మాట చెబుతున్నారు. ప్రస్తుతం ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు, స్పాన్సర్లకు, అభిమానులకు బీసీసీఐ క్రమంగా సమాచారాన్ని అందిస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బోర్డు పేర్కొంది.