టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశాడు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు అసలు కారణాలేంటో ఓపెన్గా చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లోనూ తాను అనుభవించిన ఒత్తిడి, ఎప్పటికప్పుడు తాను ఎదుర్కొన్న అంచనాలు, తనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో తాను ఆ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు.
“అప్పుడు నేను ఆటను ఆస్వాదించలేకపోయాను. కెప్టెన్గా విజయాల కోసం శ్రమిస్తూ, ఆటగాడిగా సత్తా చాటాలనే ఒత్తిడిలో నా గేమ్ పై పట్టు తగ్గిపోయింది. నేను మళ్లీ ప్రెషర్ లేకుండా ఆటను ప్రేమించాలనుకున్నా. అందుకే కెప్టెన్సీకి గుడ్బై చెప్పా,” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనీ తనను ఎలా నమ్మాడో కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశాడు. “నన్ను నంబర్ 3లో బ్యాటింగ్కు పంపిన వ్యక్తి ధోనీనే. నన్ను నమ్మిన కోచ్ గ్యారీ కిర్స్టెన్ స్ఫూర్తినిచ్చారు. వారు చూపిన నమ్మకం నాకు బేస్ అయ్యింది” అని స్పష్టం చేశాడు.
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసిన కోహ్లీ.. “2016–2019 మధ్యకాలంలో కొన్ని ఇతర జట్లు నన్ను సంప్రదించాయి. కానీ నేను వెళ్లలేదు. ఆర్సీబీకి నేను కావాల్సిన ఆటగాడినే కాదు.. అభిమానులు నన్ను కుటుంబ సభ్యుల్లా చూసారు. ఆ ప్రేమే నాకు ట్రోఫీల కన్నా ఎక్కువ” అంటూ కోహ్లీ భావోద్వేగంతో చెప్పారు. తాను ఎప్పటికీ విమర్శల కన్నా అభిమానుల ప్రేమను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటానని, తాను దూకుడుగా ఆడినా, కిందపడినా.. తన వెనుక నిలిచిన వారే అభిమానులని విరాట్ కోహ్లీ చివరలో ఎమోషనల్ గా క్లారిటీ ఇచ్చాడు. “నా ఆటే నాకు గుర్తింపు. కానీ నా ఆటను గర్వపడేలా చూసింది మీ ప్రేమే” అని ఆయన అన్నారు.