ఏపీలో సంచలనం రేపుతున్న ‘చర్చి’ మరణం

ఈ రోజుల్లో కూడా పిల్లలు అనారోగ్యం పాలైతే మంత్రగాళ్ల దగ్గరికి వెళ్లి తాయిత్తులు కట్టించడం.. చర్చీలకు వెళ్లి ప్రార్థనలు చేయించడం లాంటివి చేసే జనాలు తక్కువేమీ కాదు. ఇక గాలి సోకిందని, దయ్యం పట్టిందని చేయించే పూజలు పునస్కారాల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఇలాంటి సందర్భాల్లో జనాల్లోని అమాయకత్వాన్ని వాడుకుని సొమ్ము చేసుకునే కేటుగాళ్లకు కొదవ లేదు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని జ్ఞానాపురం చర్చిలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించడం.. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమై పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. ఇంతలో ఆ బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్యహత్మకు పాల్పడడం సంచలనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో సంబంధిత ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన ఓ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలిక రెండు రోజుల కిందట విశాఖలోని జ్ఞానాపురం చర్చిలో బలిపీటం దగ్గర మృతి చెందింది. ఆ చిన్నారికి గాలి సోకిందని చర్చికి తీసుకొచ్చారు తల్లి, అమ్మమ్మ. ఐతే బాలిక చనిపోయిన సమయంలో ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో విషయం పోలీసుల వద్దకు చేరింది. బాలిక తల్లి, అమ్మమ్మను వాళ్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంలో మీడియా వాళ్లు అసలేం జరిగిందంటూ ఆ ఇద్దరినీ ప్రశ్నించే ప్రయత్నం చేయగా నోరు విప్పలేదు.

ఒక రోజు గడిచిందో లేదో ఈ తల్లీ కూతుళ్లిద్దరూ స్వల్పంగా నీళ్లున్న ఒక బావిలో విగతజీవులై కనిపించారు. పోలీసుల విచారణకు భయపడి బాలిక తల్లి, ఆమె అమ్మమ్మ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. చర్చిలో ఏదో అనుమానాస్పదంగా జరిగి ఉంటుందని.. అందుకే ఆ అమ్మాయి చనిపోయిందని కొందరు అంటుంటే.. బాలికను అదుపు చేయడంలో భాగంగా నోట్లో గుడ్డ కుక్కి, మూతికి బట్ట చుట్టారని.. ఈ క్రమంలో ఊపిరాడక ఆ బాలిక ప్రాణాలు విడిచిందని కొందరు అంటున్నారు. ఐతే ఈ మాత్రానికే బాలిక తల్లి, అమ్మమ్మ ఆత్మహత్యకు పాల్పడడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.