ఫిక్సింగ్ వాదనలతో రాజస్థాన్ కలకలం.. అసలేమైంది?

ఐపీఎల్‌ 2025లో ఓ మ్యాచ్‌ ఫలితం చుట్టూ బిగుసుకున్న వివాదం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం చెందడం తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించాయి. గెలవాల్సిన మ్యాచ్‌ను ఎలా చేజార్చుకుంది? ఆఖరి ఓవర్లలో నడిచిన విధానం ఏమిటి? అనే సందేహాలతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కన్వీనర్ జయదీప్ బిహానీ ఫిక్సింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఫిక్సింగ్ జరిగినట్లు బిహానీ చేసిన కామెంట్స్ వెంటనే వివాదానికి దారితీశాయి. ఇక రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. బిహానీ మాటలు నిరాధారమని, అవి జట్టు ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, క్రీడా శాఖా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. 

ఈ ఆరోపణలు బీసీసీఐ, స్పోర్ట్స్ కౌన్సిల్, మరియు రాయల్స్ యాజమాన్యంపై ప్రభావం చూపేలా ఉన్నాయని రాయల్స్ అధికార ప్రతినిధి దీప్ రాయ్ తెలిపారు. ఇదే అంశంపై జట్టు వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఆరోపణలు క్రికెట్‌ను అవమానించే ప్రయత్నమేనని స్పష్టం చేశాయి. అభిమానులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, ఆటగాళ్లపై అనవసరంగా అవాంఛిత నీడలు పడేలా చేస్తాయన్నారు. 

ఈ అంశంపై సీరియస్ లీగల్ యాక్షన్ తీసుకునే విషయాన్ని కూడా జట్టు యాజమాన్యం పరిశీలిస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 గెలవడంతో 4 పాయింట్లతో నిలిచింది. ఈ ఒత్తిడిలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ జట్టు పునరుత్తానం సాధ్యమవుతుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్ మదిలో మెదులుతోంది. మరి ఫిక్సింగ్ అనుమానాల నేపథ్యంలో బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.