అమెరికా ఎన్నికలపై ఇండియాలో పెరిగిపోతున్న టెన్షన్

అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలంటేనే అదేదో మన దగ్గరే ఎన్నికలు జరుగుతున్నంత టెన్షన్ పెరిగిపోతోంది. నిజానికి అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా మనకు ఒకటే. కానీ ఎన్నికల సరళిని, అవుతున్న ఖర్చును, పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ లో ఎవరికి గెలుపు అవకాశాలున్నాయి లాంటి అనేక విషయాలపై మనదేశంలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. అమెరికా లాంటి అనేక దేశాల్లో అధికారంలో ఎవరున్నా ఒకటే. ఎందుకంటే అక్కడ వ్యక్తుల కన్నా పాలసీల ప్రకారమే పరిపాలన జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగత ఇష్టాఇష్టాలతో సంబంధమే లేదు. అయినా అదేదో మన కుటుంబసభ్యులే పోటీ చేస్తున్నంతగా లేకపోతే మన దగ్గర బంధువులే పోటీలో ఉన్నంతగా టెన్షన్ పడిపోతున్నారు.

అమెరికాలో ఎన్నికలంటేనే ఎందుకింతగా భారత్ లో హడావుడి కనబడుతోంది ? ఎందుకంటే అక్కడ గెలిచే అభ్యర్ధులే ఇక్కడ మన తలరాతలు రాస్తారు కాబట్టి. దాదాపు మన కుటుంబాల్లో దగ్గరి వాళ్ళు, మన బంధువుల్లో చాలామందికి అమెరికాలో చదవుకోవటం, స్ధిరపడటమే లక్ష్యమైపోయింది. ఎలాగైనా సరే అమెరికా వెళ్ళి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనే పట్టుదల బాగా పెరిగిపోయింది. ప్రతి ఊరునుండి ఏదో కారణంతో అమెరికాకు వెళుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.

ఏ కారణంతో అమెరికా వెళ్ళినా అక్కడ వాళ్ళ భవిష్యత్తంతా ఎన్నికల్లో గెలిచే అభ్యర్దులపైనే ఆధారపడుంటుంది. 2016లో ట్రంప్ గెలిచిన తర్వాత విదేశాల వాళ్ళకు ముఖ్యంగా ఇండియన్లకు ఇబ్బందులు మొదలయ్యాయి. అనేక కారణాలతో ఇమిగ్రేషన్ నిబంధనలను మార్చేయటం, గ్రీన్ కార్డులు జారీని నిలిపేయటం, సిటిజన్ షిప్ నిబంధనల్లో మార్పులు తేవటం లాంటి అనేక కారణాలతో మన కుటుంబాల్లో టెన్షన్ పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే.

అందుకనే మనదేశంలో జరుగుతున్న బీహార్, మధ్యప్రదేశ్ లోని ఉపఎన్నికలు, తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికను పట్టించుకున్నా లేకపోయినా అమెరికా ఎన్నికలను మాత్రం రెగ్యులర్ గా కీన్ గా ఫాలో అయ్యేవాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఓ అంచనా ప్రకారం అమెరికాలో సుమారు 50 లక్షల మంది భారతీయులుంటున్నారు. వీరిలో 25 లక్షలమందికి ఓటుహక్కుంది. ఓటుహక్కు లేని వాళ్ళల్లో సుమారు 10 లక్షలమంది భవిష్యత్తు గెలిచే అభ్యర్ధుల మీదే ఆధారపడుంది. ట్రంప్ రెండోసారి గెలిస్తే పై పది లక్షల మంది దాదాపు భారత్ కు వచ్చేయాల్సుంటుంది. అదే బైడెన్ గెలిస్తే అగ్రరాజ్యంలోనే కంటిన్యు అవ్వచ్చు.

ఇటువంటి అనేక కారణాల వల్ల భారతీయులు ముఖ్యంగా తెలుగువాళ్ళు జో బైడెన్ కే ఓట్లు వేస్తున్నారు. బైడెన్ కే ఓట్లు వేయాలని, బైడెన్ కే నిధులు ఇవ్వాలని ప్రచారం చేస్తున్న ఇండియన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నవంబర్ 3వ తేదీన జరగబోయే పోలింగ్ లో భారతీయుల ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్న విషయం సర్వేలో ఇఫ్పటికే బయటపడింది. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో సంఖ్యాపరంగా మొదటిస్ధానం పంజాబీలది అయితే తర్వాత తెలుగువాళ్ళదే మెజారిటీనట. మరి మన ఆకాంక్షలకు తగ్గట్లుగా ఎవరు గెలుస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే.