అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అయినా కూడా అధికార యంత్రాగం మొద్దు నిద్ర వీడటం లేదు. జనం ప్రాణాలు హరిస్తున్న ఈ భాణ సంచా తయారీపై ఓ సురక్షితమైన పాలసీ రూపొందిద్దామన్న కనీస యావ ప్రభుత్వాలకూ రావడం లేదు. వెరసి నిత్య ఈ తరహా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం ఏపీలో జరిగిన ఈ తరహా ప్రమాదంలో ఆరుగురు మృత్యు వాత పడగా… మరో ఐదుగురు గాయడపడ్డారు. 

ఏపీలోని ఉత్తరాంధ్రలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల బాణసంచా తయారీకి ప్రసిద్ధి. మండల పరిధిలోని కైలాసపట్నంలో ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో సామర్లకోటకు చెందిన కార్మికులు పనిచేస్తుండగా… వారిలో ఓ నలుగురు చనిపోగా… ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ పేలుడు ఎంత తీవ్రంగా జరిగిందంటే.. పేలుడు ధాటికి సదరు కర్మాగారం నామరూపాల్లేకుండా ఎగిరిపోయింది.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదం సందర్భంగా ఏర్పడ్డ పేలుడు శబ్ధం పరిసర ప్రాంతాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. అంతేకాకుండా ఈ పేలుడు ధాటికి సదరు కర్మాగారం పరిసరాల్లోని పలు నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. సాధారణంగా తమిళనాడులోని శివకాశిలో బాణసంచా పేలుడు ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటూ ఉంటాయి. కాలక్రమంలో దేశంలోని ఇతర ప్రాంతాకూ బాణసంచా తయారీ కేంద్రాలు విస్తరించగా… ఇప్పుడు ఈ తరహా ప్రమాదాలు ఇతర ప్రాంతాల్లోనూ నిత్యకృత్యం అయిపోయాయి.