ఏపీలోని అన్నమయ్య జిల్లా వెలసిన ఒంటమిట్ల రాములోరికి శుక్రవారం భారీ బంగారు కిరీటాలు విరాళంగా అందాయి. రాములోరితో పాటుగా సీతమ్మ తల్లి, లక్ష్మణులకు ఒక్కో కిరీటం చొప్పున బంగారంతో చేయించిన ఓ భక్తుడు సీతారాముల కల్యాణం సందర్భంగా శుక్రవారం స్వామి వారికి సమర్పించారు. ఈ మూడు కిరీటాలను ఏకంగా 7 కిలోల బంగారంతో చేయించారు. ఇందుకోసం ఏకంగా రూ.6.6 కోట్ల నిధులను ఆ భక్తుడు ఖర్చు చేశారు. బంగారు కాంతులతో తళులీనుతున్న ఆ కిరీటాలను శుక్రవారం సదరు భక్తుడి కుటుంబం తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావుల చేతుల మీదుగా స్వామి వారికి సమర్పించారు.
ఈ భూరి విరాళాన్ని ఏపికి చెందిన పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం చేయించింది. తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో రాములోకి కల్యాణం కోసం అంతా భద్రాచలం వచ్చేవారు. అయితే తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయంలో ఏపీ ప్రభుత్వం రాములోరి కల్యాణాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఒంటిమిట్ల ఆలయాన్ని టీటీడీ దత్తత తీసుకుని ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. ఏటా ఏపీ ప్రభుత్వం అధికారికంగా రాములోరి కల్యాణాన్ని ఇక్కడే నిర్వహిస్తున్న తరుణంలో ఆలయానికి వస్తున్న భక్త జనం కూడా అమాంతంగా పెరిగింది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది రాములోరి కల్యాణం సందర్భంగా సీతారాములకు ఏదో ఒక బహుమతిని ఇవ్వాలన్న దిశగా సాగిన పెన్నా ప్రతాప్ రెడ్డి కుటుంబం… స్వామి, అమ్మవార్లతో పాటుగా లక్ష్మణ స్వామికి కూడా బంగారు కిరీటాలను అందిస్తే బాగుంటుందని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా మొత్తంగా 7 కిలోల బంగారాన్ని రూ.6.6 కోట్లతో కొనుగోలు చేసిన ప్రతాప్ రెడ్డి కుటుంబం ఆ బంగారంతో ఆణిముత్యాల్లాంటి కిరీటాలను తయారు చేయించింది. శుక్రవారం రాములోరి కల్యాణం సందర్భంగా వాటిని ప్రతాప్ రెడ్డి కుటుంబం ఆలయానికి అందజేసింది.