రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ మృతి… చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జిల్లా కేంద్రానికి వెళుతున్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిణి దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధికి సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా సుగాలి రమ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని పీలేరు కేంద్రంగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ సెల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం కూడా గ్రీవెన్స్ సెల్ కు హాజరయ్యే నిమిత్తం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి రమ కారులో బయలుదేరారు. అయితే ఆమె తన గమ్యస్థానం చేరకముందే మృత్యువాత పడ్డారు.

పీలేరు నుంచి రాయచోటికి వెళుతున్న క్రమంలో సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద ఎదురుగా వస్తున్న కారును స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రమ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు… రమ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన మహిళా అధికారి మరణం అధికార వర్గాలను విషాదంలో ముంచేసింది.

ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలిసినంతనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రీవెన్స్ సెల్ లో ప్రజా ఫిర్యాదులను స్వీకరించేందుకు వెళుతున్న రమ మృతి చెందడం దురదృష్ణకరమని ఆయన అన్నారు. రమ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ఓ సంతాప ప్రకటనను విడుదల చేశారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు.