ఐపీఎల్ ఏ రేంజి హిట్టంటే..


ఈ ఏడాది కరోనా ధాటికి అల్లాడిపోయారు భారతీయులు. ఏ బాదరబందీల్లేకుండా జీవనం సాగిస్తున్న వాళ్లను కూడా బాగా కంగారు పెట్టేసిందీ మహమ్మారి. స్వేచ్ఛ విలువేంటో కరోనా టైంలోనే అందరికీ తెలిసొచ్చింది. ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టాలంటే పరి పరి విధాలా ఆలోచించేలా చేసింది. ఇంతకుముందున్న సరదాలు, వినోదాలు అన్నీ బంద్ అయిపోయాయి. బయట అన్ని పనులూ చేసుకుంటున్నా సరే.. ఒకప్పట్లా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడలేం, స్టేడియానికెళ్లి మ్యాచ్ వీక్షించలేం. అమ్యూజ్మెంట్ పార్కులకెళ్లలేం.

ఇలాంటి తరుణంలో యువతకు గొప్ప ఉపశమనాన్ని అందిస్తున్న వినోదం.. ఐపీఎల్. కరోనాతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాక క్రికెట్ ప్రియులకు ఈ టోర్నీ అందిస్తున్న వినోదం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ లీగ్ లేకపోయి ఉంటే 2020 పూర్తిగా డ్రై అయిపోయేదే.

ఐపీఎల్ ఇండియాలో జరక్కపోతేనేం.. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకపోతేనేం.. కానీ ఎంటర్టైన్మెంట్‌కు మాత్రం లోటు లేదు. అత్యంత ఉత్కంఠభరితంగా, వినోదాత్మకంగా సాగుతున్న ఐపీఎల్‌.. 40 రోజులుగా అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది. ఈ లీగ్ ఏ రేంజిలో హిట్టయిందనడానికి ‘బార్క్’ వెల్లడించిన తాజా గణాంకాలే రుజువు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఐపీఎల్‌ వీక్షకుల సంఖ్య 28 శాతం పెరిగిందట.

క్రికెట్ ప్రియులకు ఐపీఎల్ ఎప్పుడూ ఫేవరెట్ టోర్నీయే. ప్రతి సంవత్సరం దీనికి భారీగానే వ్యూయర్ షిప్‌ ఉంటుంది. క్రికెట్ ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ లీగ్‌ను చూస్తారు. అలాంటిది ఈసారి 28 శాతం వీక్షణ పెరగడం అంటే మామూలు విషయం కాదు. ఆట పరంగా కొత్తగా టోర్నీలో వచ్చిన మార్పేమీ లేదు. కాకపోతే ఇతర వినోదాలన్నీ బంద్ అయిపోయిన నేపథ్యంలో యూత్ ప్రతి రోజూ కచ్చితంగా మ్యాచ్‌లు ఫాలో అవుతున్నారని స్పష్టమవుతోంది. డ్రీమ్ ఎలెవన్ తరహా ఫాంటసీ లీగ్‌లు కూడా బాగా పెరిగిపోవడంతో మ్యాచ్‌లను విడవకుండా చూసేవారి సంఖ్య పెరగడంతో ఐపీఎల్‌కు వ్యూయర్‌షిప్ ఈ స్థాయిలో పెరిగిందని అర్థమవుతోంది.