ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రాథి మరోసారి తన వివాదాస్పద నోట్బుక్ సెలబ్రేషన్తో వార్తల్లోకెక్కాడు. ముంబయి ఇండియన్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో నామన్ ధీర్ వికెట్ తీసిన అనంతరం ఆయన మళ్లీ అదే సెలబ్రేషన్ చేశారు. గతంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేసిన తర్వాత రాథి ఇదే పద్ధతిలో సెలబ్రేట్ చేయగా, బీసీసీఐ అతడిపై 25 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించింది.
ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ చేసినందుకు మరోసారి జరిమానాతోపాటు రెండు డెమెరిట్ పాయింట్లు పడినట్టు అధికారికంగా ప్రకటించారు. ఇది రాథికి రెండోసారి అలాంటి అపరాధం కింద జరిమానా విధించబడిన సందర్భం కావడంతో, ఐసీసీ నిబంధనల ప్రకారం ఎక్కువ శిక్ష విధించారు. తొలి సెలబ్రేషన్ సమయంలో బ్యాటర్కు దగ్గరగా వెళ్లిన రాథి, శారీరక కాంటాక్ట్ కూడా చేశాడు. అయితే ముంబయితో మ్యాచ్లో మాత్రం కొంత దూరంలో నుంచే సెలబ్రేట్ చేశాడు.
అయినా ఆర్టికల్ నిబంధనలు 2.5 ప్రకారం, బౌలర్ ఎలాంటి సంబరాన్ని కానీ, మాటల్ని కానీ, వికెట్ పడిన తర్వాత బ్యాటర్ను నెగటివ్గా ప్రభావితం చేసేలా చేస్తే అది శిక్షార్హమే. ఆర్టికల్ 2.5 ప్రకారం ఒక ఆటగాడు బ్యాటర్ ఔట్ అయిన సమయంలో, అతనికి వ్యతిరేకంగా ప్రవర్తించటం, పదాలు వాడటం లేదా చులకనగా వ్యవహరించటం నిషేధించబడింది. దాంతో ఈ రెండోసారి డెమెరిట్ పాయింట్లు పెరగడంతో పాటు భారీ జరిమానా కూడా పడింది.
నాలుగు డెమెరిట్ పాయింట్లు చేరిన వెంటనే ఒక సస్పెన్షన్ పాయింట్ వస్తుంది. అంటే ఆటగాడు ఒక మ్యాచ్కు దూరం కావాల్సి వస్తుంది. ఇవన్నీ 36 నెలల పాటు రికార్డ్లో ఉంటాయి. ఇది రాథి ఐపీఎల్ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయినా.. పక్కనే ఈ వివాదం కలవరం కలిగిస్తోంది. ముంబయి 204 లక్ష్యంతో బరిలోకి దిగగా, రాథి 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి కీలక వికెట్ తీసాడు. ఈ మ్యాచ్లో ఇతర లక్నో బౌలర్ల ఎకానమీ 10కి పైగానే ఉండగా, రాథి మాత్రం 5.25 ఎకానమీతో మెరిశాడు. అందుకే అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.