‘ఎక్స్’ను ఊపేస్తున్న పికిల్స్ గొడవ

అలేఖ్య చిట్టి పికిల్స్.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి దీని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రాజమండ్రికి చెందిన ముగ్గురు సిస్టర్స్ కలిసి మొదలుపెట్టిన ఈ వ్యాపారం సూపర్ సక్సెస్ అయింది. కేవలం సోషల్ మీడియా ప్రమోషన్‌తోనే ఈ అక్క చెల్లెల్లు ఈ బిజినెస్‌ను చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. ఆ ముగ్గురు సిస్టర్స్‌లో ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్ కూడా. వారికి మాంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

ఓవైపు పచ్చళ్ల వ్యాపారంతో, మరోవైపు సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో ఈ సిస్టర్స్ తిరుగులేని రీతిలో సాగిపోతున్నారు. పచ్చళ్ల బిజినెస్ టర్నోవర్ కోట్ల స్థాయికి కూడా వెళ్లినట్లు సమాచారం. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి వారి బిజినెస్ ఒక్కసారిగా పడిపోయింది. మొత్తంగా వ్యాపారమే మూసేయాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుక్కారణం.. పచ్చళ్లకు అధిక రేట్లు పెట్టడం గురించి ప్రస్తావించిన ఓ కస్టమర్‌ను బూతులు తిట్టడమే.

పచ్చళ్ల ఆర్డర్లను వీళ్లు ఎక్కువగా వాట్సాప్ ద్వారా స్వీకరిస్తుంటారు. ఐతే ఒక కస్టమర్ రేట్ కార్డు చూసి.. మరీ ఎక్కువ రేటు ఉన్నాయే అని కామెంట్ చేయగా.. ముగ్గురు సిస్టర్స్‌లో ఒకరు పచ్చి బూతులు తిట్టారు. ముష్టి పచ్చళ్లనే కొనివ్వలేకపోతే నీ పెళ్లాం నిన్ను వదిలేసి పారిపోతుంది.. అంటూ ఇంకా రాయలేని భాషలో దారుణమైన బూతులు తిట్టింది. ఇలా అయితే కష్టం కెరీర్ మీద ఫోకస్ చెయ్యి అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చింది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సిస్టర్స్ ముగ్గురిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. వ్యాపారానికి బాగా ఉపయోగపడ్డ సోషల్ మీడియాలోనే ఇప్పుడు తీవ్రమైన నెగెటివిటీ ఎదుర్కొన్నారు సిస్టర్స్. బిజినెస్ కోసం వాడే వాట్పాప్ నంబర్‌కు వందల మంది కాల్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. దీంతో ఆ నంబర్ ఆపేయాల్సి వచ్చింది. వెబ్ సైట్ సైతం డౌన్ అయింది. మొత్తంగా కొన్ని రోజుల నుంచి బిజినెసే ఆగిపోయింది.

ఇదే సమయంలో మరో కస్టమర్‌ను బూతులు తిట్టిన ఆడియో సైతం బయటికి వచ్చింది. దీంతో నెగెటివిటీ ఇంకా పెరిగిపోయింది. తొలి ఆడియో బయటికి వచ్చాక మీమ్స్, ట్రోల్స్ అయితే లెక్కేలేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ కొనడం కూడా ఒక స్టేటస్ సింబల్ అంటూ బోలెడన్ని సెటైర్లు పడుతున్నాయి. ఈ సిస్టర్స్‌లో ఒకరు వచ్చి వివరణ ఇస్తూ.. తిట్టింది ఒకరైతే తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే తప్ప ఆమె కూడా తప్పును అంగీకరించలేదు. అసలు బూతులు తిట్టిన వ్యక్తి ఇంత వరకు వచ్చి సారీ చెప్పకపోవడంతో వీరి పట్ల నెగెటివిటీ ఇంకా పెరిగిపోతోంది.