సీఎస్కే తేల్చేసింది.. ఇక నిర్ణయం ధోనీదే

కెరీర్లో ఎన్నడూ లేనంతగా విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు మహేంద్రసింగ్ ధోని ఈ మధ్య. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో ఎన్నడూ చూడని పరాభవాలు చవిచూసింది. లీగ్‌లో ఆడిన ప్రతిసారీ సెమీస్ లేదా ప్లేఆఫ్ చేరిన ఆ జట్టు.. తొలిసారి ఈ సీజన్లో ముందంజ వేయలేకపోయింది. ఇప్పటిదాకా టోర్నీలో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టు అదే. అంతే కాదు.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.

టోర్నీలో వేరే జట్లు కూడా ఓడుతున్నాయి కానీ.. చెన్నై ఆట, ఓడిన తీరు ఘోరాతి ఘోరం. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా ధోని పూర్తిగా తేలిపోయాడు ఈ సీజన్లో. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ డిమాండ్లకు తగ్గట్లుగా ఆడలేక రిటైర్మెంట్ తీసుకున్న ధోని.. ఐపీఎల్‌లో కూడా కొనసాగలేడన్న అభిప్రాయం ఈ సీజన్లో కలిగించాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా ధోని సాధికారికంగా బ్యాటింగ్ చేయలేదు. దీంతో అతడి కథ ముగిసిందనే అభిప్రాయం చాలామందిలో కలిగింది. ధోని వీరాభిమానులు సైతం అతణ్నలా చూడలేకపోయారు.

ఈ నేపథ్యంలో ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ధోని ఎవరితోనూ చెప్పించుకునే రకం కాదని అందరికీ తెలుసు. తనలో చేవ తగ్గిందని తెలిస్తే తనకు తానుగా తప్పుకునే రకం. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ వరకు ధోని ఉంటాడా లేదా అన్న ఉత్కంఠ మొదలైంది. అతడి నుంచి సీజన్ చివర్లో ఏమైనా అనౌన్స్‌మెంట్ వస్తుందేమో అని కూడా చూస్తున్నారు. కానీ ఈ లోపు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ స్పందించింది.

ఈ సీజన్లో తమ జట్టు విఫలమైనప్పటికీ వచ్చే సీజన్‌కు కూడా ధోనీనే కెప్టెన్ అని ప్రకటించేసింది. ఒక సీజన్లో ఫెయిలైనంత మాత్రాన ధోనీ మీద తమ నమ్మకం సడలిపోదని పేర్కొంది. ఫ్రాంఛైజీ వరకైతే ధోని పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని, అతనే కొనసాగాలని కోరుకుంటోందని స్పష్టమైపోయింది. ఇక తేల్చాల్సింది ధోనీనే. ఇంకో ఐదు నెలల్లోనే మళ్లీ ఐపీఎల్ వస్తుంది కాబట్టి కొనసాగుదామని అనుకుంటాడా లేక తన ఫిట్నెస్, జట్టు పరిస్థితి చూసుకుని ఇక చాలని కాడి వదిలేస్తాడా అన్నది ధోని నిర్ణయమే. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.