ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైపోయింది. గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఇదివరకే జరిగిన ప్రిలిమ్స్ కు హాజరైన వారిలో 93 దాకా మెయిన్స్ కు అర్హత సాధిస్తే… వారిలో శనివారం రాత్రికే 84 వేల మంది అభ్యర్థుల దాకా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్పీ ప్రకటించింది. రోస్టర్ విధానంపై నెలకొన్న వివాదంతో పరీక్షలు వాయిదా పడతాయంటూ ప్రచారం జరిగినా… ఏర్పాట్లన్నీ చేశాక వాయిదా వేయలేమంటూ ఏపీపీఎస్సీ ఒకంత కఠినంగా నిలబడటంతో ఆదివారం పరీక్షలు ప్రారంభమైపోయాయి.
హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారంటే… అలాంటి వారంతా పరీక్షకు సిద్ధమైన వారి కిందే లెక్క. మరి ఆదివారం నాటి పరీక్షకు ఎంతమంది హాజరయ్యారన్న విషయం సాయంత్రానికి గాని తెలియదు. అయితే ఈ పరీక్షలు రాసేందుకు ఓ యువతి పెళ్లి దుస్తుల్లో పరీక్షా కేంద్రానికి వచ్చి అందరినీ ఆకట్టుకుంది. ఈ ఘటన తిరుపతి నగనంలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద ఈ ఆసక్తికర ఘటన కనిపించింది. పెళ్లి దుస్తులే కాదు… ఏకంగా జీలకర్ర బెల్లంతో కూడిన తమలపాకును తలపై పెట్టుకుని మరీ ఆ యువతి పరీక్ష రాసేందుకు వచ్చారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… చిత్తూరు నగరానికి చెందిన నమిత గ్రూప్ 2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇదివరకే జరిగిన ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన ఆమె… మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. అయితే మెయిన్స్ పరీక్షలు జరిగేలోగానే ఆమెకు పెళ్లి సంబంధం కుదిరింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి అస్పష్టత నెలకొనడంతో ఆదివారం (ఫిబ్రవరి 23)న మంచి ముహూర్తం ఉండటంతో అదే రోజున పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తీరా పరీక్ష వాయిదా పడలేదు. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రకటించిన ఏపీపీఎస్సీ… అనుకున్నట్లుగానే పరీక్షను నిర్వహించింది.
ఎలాగూ నిర్ణయించుకున్న మేరకు వివాహ వేడుక జరిగిపోయింది కదా.. కష్టపడి చదివి ఇప్పటికే ప్రిలిమ్స్ పాస్ అయ్యి..మెయిన్స్ కు కూడా బాగానే ప్రిపేర్ అయ్యాను కదా… పరీక్షకు హాజరైన ఉద్యోగం రాపోతుందా? అని నమిత ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ఇదే విషయాన్ని తన జీవిత భాగస్వామిగా మారిపోయిన భర్తకు చెబితే.. ఆయన కూడా సరేనన్నారు. అయితే ఆదివారం తెల్లవారుజామున పెళ్లి జరిగితే… పొద్దున్నే పరీక్ష ఉంది. తలపై జీలకర్ర,బెల్లం తీయొద్దని పండితులు చెప్పినట్టున్నారు… దీంతో తలపై జీలకర్ర, బెల్లంతో కూడిన తమలపాకును అలా తలపైై పెట్టుకుని ఆమె ఎగ్జామ్ సెంటర్ కు వచ్చేశారు. భర్తతో ఆల్ ద బెస్ట్ చెప్పించుకుని అలా ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లిపోయారు. ఈ వీడియో, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates