గిల్ సెంచరీతో భారత్ మొదటి విజయం

భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించింది. దుబాయ్ వేదికగా జరిగిన బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 229 పరుగుల లక్ష్యాన్ని 46.3 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంలో శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. అతను 129 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ శతకం గిల్‌కి వన్డేల్లో ఎనిమిదోది కావడం విశేషం.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకే ఆలౌట్ అయింది. తౌహిద్ హృదయ్ 118 బంతుల్లో 100 పరుగులు చేసి తనదైన ఆటతీరును ప్రదర్శించాడు. జాకర్ అలీ 68 పరుగులతో అతనికి సహకరించాడు. కానీ మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. భారత్ బౌలర్లలో మహ్మద్ షమి అద్భుత ప్రదర్శనతో ఐదు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను కట్టడి చేశాడు. హర్షిత్ రాణా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.

లక్ష్యాన్ని చేధించడానికి భారత్ బరిలోకి దిగినప్పుడు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభం ఇచ్చారు. రోహిత్ 41 పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తర్వాత కోహ్లీ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శ్రేయస్ అయ్యర్ (15) మరియు అక్షర్ పటేల్ (8) కూడా పెద్దగా రాణించలేదు. కానీ గిల్ ఒక వైపున స్థిరంగా నిలబడి, కేఎల్ రాహుల్‌తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

గిల్ ఆటతీరు ప్రత్యేకంగా నిలిచింది. మొదటి నుంచీ క్రమశిక్షణతో ఆడిన అతను 125 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. ముఖ్యంగా బౌండరీలు తగ్గించి, సింగిల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. రాహుల్ కూడా 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్-రాహుల్ భాగస్వామ్యం 92 పరుగులు జోడించి, జట్టును విజయపథంలో ఉంచింది.

మొత్తంగా, బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హొస్సేన్ రెండు వికెట్లు తీయగా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ తీసారు. కానీ గిల్ పట్టుదలతో ఆడటంతో ఆ ప్రయత్నాలు వృథా అయ్యాయి. భారత్ తన తొలి మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీ దిశగా దృఢంగా అడుగులు వేసింది. ఇక నెక్స్ట్ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ తో తలపడనుంది. ఆదివారం దుబాయ్ లొనే ఈ మ్యాచ్ జరగనుంది.