క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. షమీ వచ్చేశాడు!

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ గత కొంతకాలంగా భారత టీమ్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది వన్డే వరల్డ్‌కప్‌లో గాయపడిన తర్వాత చాలా కాలం రెస్ట్ లొనే ఉన్నాడు. ఇటీవల ఐపీఎల్ సీజన్ కు కూడా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. బుమ్రా తో పాటు జట్టుకు ప్రధాన బలంగా ఉన్న షమీ లేకపోవడంతో చాలాసార్లు ఆ లోటు కనిపించింది.

ఇక ఎట్టకేలకు షమీ పూర్తిగా కోలుకున్నాడు. తన పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన విషయాన్ని షమీ అభిమానులతో పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు ముగిసిన తరువాత, షమీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ తన శక్తి తిరిగి సాధించుకున్నట్లు ప్రకటించాడు. చీలమండ గాయం కారణంగా గతేడాది సర్జరీ చేయించుకున్న షమీ, అప్పటినుంచి ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

ఇటీవలే ప్రాక్టీసును ప్రారంభించిన ఆయన, ఇప్పుడు పూర్తిగా తాను మునుపటి స్థాయికి చేరుకున్నానని తెలిపాడు. ఈ క్రమంలో తన బౌలింగ్ ఫిట్‌నెస్‌పై వచ్చిన అనుమానాలకు కూడా ఆయన సమాధానం ఇచ్చాడు. బెంగళూరులో నెట్స్ సెషన్‌లో పూర్తిగా బౌలింగ్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు షమీ చెప్పాడు.

“ఇంతకాలం హాఫ్ రన్‌అప్‌తోనే బౌలింగ్ చేశాను, ఎందుకంటే ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. కానీ తాజాగా పూర్తి రన్‌అప్‌తో బౌలింగ్ చేస్తూ నా శక్తిని పరీక్షించుకున్నాను. ఇప్పుడు నాలో 100% నొప్పి లేకుండా ఉన్నాను” అని షమీ తెలిపాడు. అంతేకాకుండా, రంజీ ట్రోఫీ ద్వారా తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు.

తన రాష్ట్ర జట్టు బెంగాల్ తరపున రంజీ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడాలని, ఆ ద్వారా తన పూర్తి స్థాయి ఆటతీరును నిరూపించుకోవాలనుకుంటున్నట్లు షమీ చెప్పారు. ఆసీస్ టూర్‌కు ముందు తాను సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నట్లు చెప్పాడు. మహ్మద్ షమీ కోలుకున్న వార్తతో భారత క్రికెట్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.