ప్రతి విచారణ లైవ్‌.. సుప్రీంకోర్టు కొత్త ప్రయోగం!

సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో ఇకపై మరింత పారదర్శకత రానుంది. కోర్టు విచారణలను ప్రజలందరూ లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించేందుకు వీలుగా సుప్రీంకోర్టు యాప్‌ను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాప్‌ పై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు. లోపాలను సవరించి, త్వరలోనే దీన్ని ప్రారంభించాలని సుప్రీంకోర్టు యోచిస్తోంది. ఈ విధానంతో దేశ ప్రజలకు చట్టసంబంధి నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు.

అయితే 2018లోనే సుప్రీంకోర్టు కొన్ని కేసుల విచారణలను లైవ్‌ స్ట్రీమ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ, వాస్తవంగా ఈ ప్రణాళిక అమలులోకి రాలేదు. ఇంతవరకు దేశ ప్రజలు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యవహారాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా ఉంది. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు చట్టసంబంధి నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు తొలిసారి రాజ్యాంగ ధర్మాసనం విచారణలను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ముఖ్యంగా శివసేనలోని విభేదాలు, మహారాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మలుపులతో కూడిన సేన vs సేన కేసు తొలి లైవ్‌ స్ట్రీమింగ్‌ గా అప్పట్లో వైరల్ అయ్యింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీ విరమణ సమయంలో చివరి కేసు విచారణను లైవ్‌ స్ట్రీమ్‌ చేశారు. ఈ తరహా విధానంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 వంటి కేసులపై కూడా ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఇప్పటివరకు కొన్ని కీలక కేసులనే లైవ్‌ స్ట్రీమ్‌ చేసిన సుప్రీం, ఇప్పుడు అన్ని కేసులను కూడా ఈ విధానంలో చూపేందుకు సిద్ధమవుతోంది. త్వరలో అందుబాటులోకి రానున్న సుప్రీంకోర్టు యాప్‌ ద్వారా ప్రజలు లైవ్‌ స్ట్రీమింగ్‌ను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.