46 పరుగులకే.. టీమిండియా మరో చెత్త రికార్డ్

గత 36 ఏళ్ళకు న్యూజిలాండ్ భారత్ గడ్డపై ఒక్క టెస్ట్ సీరీస్ లో కూడా విజయం సాధించలేదు. ఇక బుధవారం బెంగుళూరు చిన్నస్వామీ స్టేడియంలో మొదలైన టెస్టులో భారత్‌ కు తిరుగులేదని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా న్యూజిలాండ్‌ బౌలర్లు భారత్‌ బ్యాటింగ్‌ లైనప్ ను ఒక్కసారిగా కూల్చేశారు. తొలిఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్‌ అయింది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్‌ సొంతగడ్డపై ఇది అత్యల్ప స్కోర్‌.

భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (2), యశస్వి జైస్వాల్‌ (13) కొన్ని ఓవర్ల పాటు వికెట్‌ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. అయితే, సౌథీ ఇన్‌స్వింగర్‌ బంతితో రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి, భారత్‌ను ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (0), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) లు కూడా ఆ కివీస్‌ బౌలర్ల ముందు తలవంచారు. ఈ మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు, అత్యధిక పరుగులు చేసిన వారు రిషభ్‌ పంత్‌ (20), యశస్వి జైస్వాల్‌ (13) మాత్రమే. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ 4 వికెట్లు పడగొట్టగా, సౌథీ ఒక వికెట్‌ తీశాడు.

ఇక భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై ఇది అత్యల్ప స్కోరుగా ఒక చెత్త రికార్డుగా నమోదైంది. 2021లో ముంబయి వేదికగా కివీస్‌పైనే 62 పరుగులు చేసిన భారత్‌ ఈ సారి 46 పరుగులతో ఆ రికార్డును మరింత చెత్తగా మార్చుకుంది. అదిలైడ్‌లో 2020లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకే ఆలౌటైన రికార్డుకి ఇది దగ్గరగా ఉంది.

బెంగుళూరులో ఇటీవల వర్షాలు కారణంగా కూడా పిచ్ ఒక్కసారిగా బౌలర్లకు ఆయువు పట్టులా మారింది. దీంతో న్యూజిలాండ్‌ పేసర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బంతులు సంధించారు. న్యూజిలాండ్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, తన 26వ టెస్టులో వంద వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అతను అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న కివీస్‌ బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు.