డ్రాగన్ కు షాకిచ్చిన భారత్.. చలి కూడా ఏమి చేయలేకపోతోందా ?

డ్రాగన్ సైన్యాలకు మన సైన్యాలు పెద్ద షాకే ఇచ్చాయి. శీతాకాలం మొదలైంది కదా భారత్ సైన్యాలు వెనక్కు వెళ్ళిపోతాయని చైనా ఆశించింది. కానీ మైనస్ డిగ్రీల చలిని సైతం తట్టుకునే ఏర్పాట్లు చేసుకున్న మన సైన్యాలు ఉన్నచోట నుండి ఎక్కడికి కదలకుండా ఉన్నచోటే కూర్చున్నాయి. అంతేకాకుండా యుద్ధ అవసరాలను కూడా మరింతగా పెంచుకోవటం చూసిన డ్రాగన్ కు షాక్ కొట్టినట్లయ్యింది. దాంతో ఏమి చేయాలో తెలీక బిత్తరపోయిన చైనా సైన్యం భారత్ సైన్యాలు చేసుకుంటున్న ఏర్పాట్లను కళ్ళప్పగించి చూస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే హిమాలయాల అంచునున్న, హియాలయాలపైన కొన్ని సున్నితమైన పర్వత ప్రాంతాల్లో శీతాకాలంలో చలి మైనస్ డిగ్రీల్లో ఉంటుంది. ఏడాదిలో మిగిలిన కాలంలో సరిహద్దుల్లో సైన్యం పహారా ఎలాగున్నా చలికాలం మొదలైన తర్వాత మాత్రం బాగా తగ్గిపోతుంది. చలిని భరించలేక చాలామంది సైనికులు చనిపోవటం ఇక్కడ మామూలే. అందుకనే సైన్యాలను పోగొట్టుకోవటం ఇష్టంలేక మొన్నటి వరకు చాలామందిని ఇక్కడనుండి ఉపసంహరించేస్తున్నారు. ఏదో నామమాత్రపు బలగాలు మాత్రమే అదికూడా రొటేషన్ పద్దతిలో సరిహద్దుల్లో కాపలా కాస్తుండేవారు.

అయితే గడచిన కొద్ది నెలలుగా సరిహద్దుల్లో చైనాతో మనకు మొదలైన ఉద్రిక్తతల నేపధ్యంలో ఏమి చేయాలనే విషయాన్ని సైన్యాధికారులు ఆలోచించారు. బలగాలను ఉపసంహరించుకోవటమా ? లేకపోతే చలికి సైన్యాన్ని అప్పగించేయటమా ? అన్నదే ప్రధాన సమస్య. అయితే పై రెండు కాకుండా మరో ప్రత్యామ్నాయాన్ని సైనికాధికారులు ఆలోచించారు. అదేమిటంటే యావత్ సైన్యాన్ని సరిహద్దుల్లోనే మోహరించాలన్నది మొదటిది. అయితే సరిహద్దుల్లో గతంలో ఎన్నడు లేని పద్దతిలో సైన్యానికి చలిని తట్టుకునే సమస్త సామగ్రిని అందించటం రెండోది.

ఇందులో భాగంగానే ఎంతటి చలినైనా తట్టుకునేట్లుగా తయారైన యూనిఫారంను తెప్పించింది. అంటే యూనిఫారంలోనే బ్యాటరీలతో నడిచే వేడి ఏర్పాట్లుంటాయి. కొత్తగా సరఫరా చేసిన టెంట్లు కూడా చలిని లోపలకు ప్రవేశించకుండా అడ్డుకునే విధంగా ఇన్సులేషన్ పద్దతిలో తయారు చేయించిందట. ఇక టెంట్లలోనే ఆహారపదర్ధాలను వేడి చేసుకునేందుకు, టెంట్లలోపల వేడిగా ఉండేందుకు హీటర్లను కూడా ఏర్పాటు చేసిందట. ఎన్ని నెలలైనా చెడిపోకుండా ఉండే పద్దతిలో వేలాది టన్నుల ఆహారాన్ని కూడా తరలించింది.

వీటికి అదనంగా యుద్ధట్యాంకులు, హెలికాప్టర్లు, విమానాల ల్యాండింగ్ బేస్, యంత్ర సామగ్రి, ఆయుధాలు, క్షిపణులను మోహరించింది. సరిహద్దుల్లో ప్రస్తుతం సుమారు లక్షమంది సైనికులు పహారా కాస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. చలికాలం కదా భారత సైన్యం వెనక్కు వెళ్ళిపోగానే మళ్ళీ అక్రమణలకు రెడీ అయిపోవచ్చనుకున్న డ్రాగన్ సైన్యానికి నిజంగా ఇది షాకనే చెప్పాలి. దాదాపు 2 వేల కిలోమీటర్లున్న సరిహద్దుల్లో చాలా పాయింట్లలో మన సైన్యం ఇటువంటి ముందస్తు ఏర్పాట్లే చేసుకుందట. ఏర్పాట్లు కూడా జూలైలోనే మొదలుపెట్టేసి చలికాలం మొదలవుతున్నదగానే పూర్తి చేసేసింది. దాంతో దశాబ్దాలుగా సరిహద్దుల్లో సైన్యం ఎదుర్కొంటున్న వాతావరణ, ఆహార, ఆయుధాల సమస్యలకు దాదాపు చెక్ పడినట్లే.