బాలు చెన్నైలో ఉన్నది అందుకే మరి..

Ilayaraja

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అచ్చమైన తెలుగువాడు. ఆయనకు తెలుగంటే అమితమైన అభిమానం. తాను పుట్టిన గడ్డ మీద ప్రేమా ఎక్కువే. అలాగని ఆయన భాష, రాష్ట్రం అంటూ హద్దులేమీ పెట్టుకోలేదు. తమిళంలోనూ వేలాది పాటలు పాడేశారు. అక్కడ నంబర్ వన్ సింగ్ స్థాయికి ఎదిగారు. ఒక దశలో హిందీలోనూ ఆయన ఆధిపత్యం సాగింది.

ఇంకా పలు భాషల్లో ఆయన అద్భుతమైన పాటలు పాడారు. ఐతే బాలుకు సొంత గడ్డ మీద కంటే తమిళనాట లభించిన ఆదరణ అపూర్వమైనది. తమిళులు బాలును ఎప్పుడూ పరాయివాడిలా చూడలేదు. తమ వాడిగానే ఆదరించారు. అక్కడి వాళ్లు ఆయన్ని ప్రేమించే, గౌరవించే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బాలుకు పద్మశ్రీ పురస్కారానికి సిఫారసు చేసింది తమిళనాడు ప్రభుత్వమే అన్న సంగతి చాలామందికి తెలియదు.

తమిళ మీడియా, అక్కడి సినిమా వాళ్లు, ప్రభుత్వ పెద్దలు బాలును గౌరవించే తీరే వేరుగా ఉంటుంది. ఆ విషయంలో తెలుగు వాళ్లు వెనుకే ఉంటారు. బాలుకు మన వాళ్లు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదనే అభిప్రాయం బలంగా ఉంది. ప్రపంచంలోనే అరుదైన గాయకుల్లో ఒకరైన ఆయనకు పద్మ పురస్కారాలు ఇవ్వాలని మన ప్రభుత్వాలు పెద్దగా పోరాడింది లేదు. ఇంకేవైనా పురస్కారాలు ఇవ్వడం, ఆయన్ని సముచిత రీతిలో గౌరవించడం జరగలేదన్న బాధ బాలు అభిమానుల్లో బలంగా ఉంది.

ఇప్పుడీ ప్రస్తావనంతా ఎందుకొచ్చింది అంటే.. కరోనా బారిన పడి బాలు పరిస్థితి కొంచెం విషమించిందని వార్త బయటికి రావడం ఆలస్యం.. తమిళ సినీ పరిశ్రమ నిమిషాల్లో కదిలింది. అక్కడి ప్రముఖులందరూ బాలు కోలుకోవాలంటూ ఆవేదన స్వరంతో ట్వీట్లు వేశారు. అక్కడి సామాన్యులూ అంతే. బాలుతో గొడవ పడ్డ ఇళయరాజా సైతం కాసేపటికే ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు. తమిళ జనాలు బాలు గురించి ట్రెండ్ చేశాక.. కొన్ని గంటలకు నెమ్మదిగా మన సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా స్పందించడం మొదలుపెట్టారు. తమిళులు చూపించే ఈ అభిమానం వల్లే బాలు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చేశాక కూడా ఇటు రాకుండా చెన్నైలో ఉండిపోయారని అర్థం చేసుకోవాలి.