బాబు వ‌స్తానంటే.. ఎన్టీఆర్ వ‌ద్ద‌న్నారంటా!

మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు టీడీపీలోకి వస్తానంటే మొద‌ట స్వర్గీయ ఎన్టీఆర్ వ‌ద్ద‌న్నారంటా? ఈ విషయాన్ని ఎవ‌రో కాదు.. స్వ‌యంగా బాబే వెల్ల‌డించారు.
తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడిది నాలుగు ద‌శాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రాజ‌కీయ జీవితం. ఈ పొలిటిక‌ల్ కెరీర్‌లో ఆయ‌న ఎన్నో చూశారు. మొద‌టిసారిగా చంద్ర‌గిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 44 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్బంగా ఆయ‌న గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

1978 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నుంచి చంద్ర‌బాబు తొలిసారి గెలిచారు. ఆ త‌ర్వాత 1983లో ఎన్టీఆర్ జోరు త‌ట్టుకోలేక అదే నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయి అనంత‌రం కుప్పానికి మకాం మార్చారు. కాంగ్రెస్ పార్టీతో రాజ‌కీయ జీవితాన్ని ఆరంభించిన ఆయ‌న త‌న పొలిటిక‌ల్ కెరీర్ గురించి టీడీపీ పార్టీ నేత‌ల‌తో తాజాగా వివ‌రించారు. ఈ సంద‌ర్భంగానే పాత విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన‌ప్పుడు మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి టీడీపీలో చేరాల‌నుకున్నాన‌ని ఆయ‌న చెప్పారు. కానీ ఎన్టీఆర్ వ‌ద్ద‌న్నార‌ని, అందుకే ఆగిపోయాన‌ని బాబు వెల్ల‌డించారు.

1984 రాజ‌కీయ సంక్షోభం స‌మ‌యంలో ఎన్టీఆర్‌ను అర్ధాంత‌రంగా దించేసిన‌ప్పుడు జ‌రిగిన ప్ర‌జాస్వామ్య పున‌రుద్ధ‌ర‌ణోద్య‌మంలో తాను టీడీపీలో క్రియాశీల‌క పాత్ర పోషించాన‌ని చెప్పారు. మ‌ళ్లీ ఎన్టీఆర్ సీఎం అయ్యాక తాను పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బాధ్య‌త‌లు చేప‌ట్టాన‌ని, ఆ స‌మ‌యంలో సంస్థాగ‌త బ‌లోపేతంపై దృష్టి పెట్టి బాగా ప‌నిచేశాన‌ని బాబు తెలిపారు. అప్ప‌టి పునాదులు ఇప్ప‌టికీ స‌జీవంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అయితే బాబు కావాల‌నే మొద‌ట్లో టీడీపీలో చేర‌లేద‌ని మ‌రో వ‌ర్గం ఆరోపిస్తోంది.

సినిమాల నుంచి వ‌చ్చిన ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో మ‌నుగ‌డ సాగించాలేర‌నే ఉద్దేశంతో టీడీపీలో చంద్ర‌బాబు చేర‌లేద‌నే ప్ర‌చారం ఉంది. మ‌రోవైపు అప్ప‌టి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే మామ ఎన్టీఆర్‌పై పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు బాబు ప్ర‌క‌టించార‌ని తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ వ‌ద్ద‌న్నార‌ని మొద‌ట పార్టీలో చేర‌లేద‌ని బాబు చెప్ప‌డం అబ‌ద్ధ‌మ‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  ఇక త‌న రాజకీయ జీవితంలో ఎన్టీఆర్‌, వాజ్‌పేయి వంటి మ‌హామ‌హుల‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం దక్కింద‌ని గ‌ర్వంగా చెప్పిన బాబు.. మోడీని మ‌ర్చిపోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.