కేటీఆర్ ప‌ట్టాభిషేకం ఖాయ‌మేనట‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి పీఠంపై కేటీఆర్‌… ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌.. ఈ ప‌రిణామం నిజం అవ‌డం సంగ‌తి అలా ఉంచితే, ఎన్ని సార్లు వార్త‌ల్లోకి ఎక్కిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఊహ ప్రచారంలోకి వ‌చ్చేందుకు టీఆర్ఎస్ పెద్ద‌లు అనుస‌రిస్తున్న వ్యూహాలు లేదా ఈ అంచ‌నాను బ‌ల‌ప‌రిచేలా క‌నిపించే సంఘ‌ట‌న‌లు దీనికి కార‌ణం.

ఇక పాయింట్లోకి వ‌చ్చేస్తే, ఒకింత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ ప్ర‌చారంలోకి వ‌చ్చేందుకు కార‌ణం తెలంగాణ సీఎం కేసీఆర్ వేస్తున్న ఎత్తుగ‌డ‌లు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పార్ల‌మెంటు వేదిక‌గా మ‌రోమారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ భ‌గ్గుమంటోంది. గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆందోళ‌న‌లు చేస్తోంది. అయితే, పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా కేంద్రం బ‌డ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ భ‌గ్గుమ‌న్న సంగతి తెలిసిందే.

ఏకంగా రాజ్యాంగ మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్పందించారు. దాదాపు రెండు గంట‌ల పాటు ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. అయితే, తాజాగా ప్ర‌ధాని మోడీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో స్వాగ‌తం- వీడ్కోలు ప‌ల‌క‌క‌పోవ‌డంపై వ‌చ్చిన విమ‌ర్శ‌లను తిప్పికొట్ట‌డం  కావ‌చ్చు.

అనంత‌రం తాజాగా తెలంగాణ ఏర్పాటు విష‌యంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌న వైఖ‌రిని తెలియ‌జేయ‌డం కోసం అయి ఉండ‌వ‌చ్చు టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడ‌లేదు. పైగా ఈ అంశాల‌లో ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ స‌ర్వం తానై పార్టీ శ్రేణుల‌కు, పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు దిశానిర్దేశం చేశారు. ఓవైపు దేశ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ చేసిన కేసీఆర్ ఆ ప‌నుల్లో బిజీగా ఉండ‌టంలో భాగంగా త‌న‌యుడికి రాష్ట్ర ప‌గ్గాలు అప్ప‌గించే ఎత్తుగ‌డ మొద‌లుపెట్టారా అంటూ కొత్త చ‌ర్చ జ‌రుగుతోంది.