మంత్రి కేటీఆర్ పిలుపు.. మోడీపై విరుచుకుప‌డ్డ‌ నేత‌లు

పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగుతోంది. తెలంగాణలోని అధాకార‌పార్టీ టీఆర్ ఎస్‌, కాంగ్రెస్లు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ ఎస్‌ శ్రేణులు ట్విటర్ లో పెట్టిన “మోడీ ఎనిమీ ఆఫ్‌ తెలంగాణ” అనే హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ పార్ల‌మెంటులో చేసిన వ్యాఖ్యలపై..  రాష్ట్రంలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు సామాజిక మాధ్యమాల్లో సైతం నిరసనలు కొనసాగుతున్నాయి. టీఆర్ ఎస్‌ మద్దతుదారులు `మోడీ ఎనిమీ ఆఫ్‌ తెలంగాణ’ పేరుతో ట్వీటర్‌లో పెట్టిన హ్యాష్‌టాగ్‌ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

టీఆర్ ఎస్‌ మద్దతుదారులు గంటలోపే 25 వేలకు పైగా ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు ట్విట్టర్ ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉన్నాయి. రాజకీయాంశాల్లో తొలిస్థానంలో నిలిచాయి.

ప్రధాని మోడీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ ఎస్‌ శ్రేణులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా నిరసన తెలపాలంటూ టీఆర్ ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా నేతలు రోడ్డెక్కారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనాలు చేస్తూ నినాదాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రధాని మాట్లాడారని నేతలు మండిపడుతున్నారు.

కాగా,  పార్ల‌మెంటులో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే… ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఆరోపించారు.  కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మైకులు ఆపేసి… ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని… మోడీ ఆక్షేపించారు. దీనిపై మంత్రులు, ఇత‌ర పార్టీల నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డడం గ‌మ‌నార్హం.