రాయచోటి : గడికోట బద్దలయ్యేనా ?!

రాయచోటి. పాత కడప జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కేంద్రం అయిన ఈ నియోజకవర్గం హాట్ సీట్ అనే చెప్పాలి. కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తొలిసారి 2009లో కాంగ్రెస్ తరపున, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున 2012, 2014, 2019లలో ఎన్నికవుతూ వస్తున్నాడు. రాయచోటి అంటే గడికోట, గడికోట అంటే రాయచోటి అన్నట్లు ఈ స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు శ్రీకాంత్ రెడ్డి.

నాలుగుసార్లు వరసగా గెలిచిన శ్రీకాంత్ రెడ్డిని ఐదో సారి బరిలోకి దింపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గడికోటను బద్దలుకొట్టాలంటే సరైన ప్రత్యర్ధి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అని భావించి ఈసారి రంగంలోకి దింపింది తెలుగుదేశం పార్టీ. రామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి 1985, 1989 ఎన్నికల్లో రాయచోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచాడు. 1994లో రామ్ ప్రసాద్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ఆయన సోదరి శ్రీలతారెడ్డి కాంగ్రెస్ తరపున స్వల్ప తేడాతో ఓడింది. ఆయన తల్లి చిన్నమండెం మండల ఎంపీపీగా పనిచేశారు. అయితే ఇటీవలె పార్టీలోకి వచ్చిన రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల కొంత వ్యతిరేకత కనిపిస్తున్నది.

2009లో కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన యువకుడు అయిన శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నేత సుగవాసి పాలకొండ్రాయుడు మీద 14,832 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. వైఎస్ మరణం తర్వాత 2012లో జగన్ కు మద్దతుగా రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీ తరపున టీడీపీ ప్రత్యర్ధి ఎస్ఎం సుగవాసి సుబ్రమణ్యంపై 56,931 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించాడు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డిపై 34,782, 32,862 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. వైసీపీలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డాడు.

ఈసారి ఎన్నికలలో శ్రీకాంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయత్నిస్తున్నది. బలిజలు అధికంగా ఉన్న ఈ స్థానంలో ఇద్దరు రెడ్లు పోటీ పడుతున్నారు. జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో బలిజల మద్దతు తమకే దక్కుతుందని టీడీపీ ఆశలు పెట్టుకున్నది. మరి రాయచోటిలో గడికోట బద్దలవుతుందా ? లేదా ? అంటే ఫలితాలు వచ్చే దాకా ఆగాల్సిందే.