ఒక మాజీ సీఎం తరఫున మరో మాజీ సీఎం ప్రచారం

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని నాయ‌కులు చేతులు క‌లుపుతున్నారు. ఒక‌రంటే.. ఒక‌రు నిప్పులు చెరిగే నేత‌లు.. కౌగిలించుకుని.. ఎన్నిక‌ల పోరులో ప్ర‌త్యేక‌త చాటుతున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు.. మాజీ ముఖ్య‌మంత్రులు.. నారా చంద్ర‌బాబు.. న‌ల్లారి కిర‌ణ్‌లు మ‌రింత ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నారు. ఇద్ద‌రూ కూడా ఒకే జిల్లా చిత్తూరుకు చెందిన వారు. జిల్లా ఒకటే అయినా.. పార్టీలు వేరు.. ప్రాంతం ఒకటే అయినా.. సిద్ధాంతాలు వేరు. రాద్ధాంతాలు కూడా వేరు. పైగా.. 40 ఏళ్ల రాజ‌కీయ శ‌త్రుత్వం!!

ఒక‌రి ఇంటిపై కాకి ఒక‌రి ఇంటిపై వాల‌నంత రాజ‌కీయం. అయితేనేం.. ఇప్పుడు బీజేపీతో టీడీపీ చేతులు క‌లిపిన నేప‌థ్యంలో ఆ శ‌త్రుత్వాన్ని.. రాజ‌కీయ రాద్ధాంతాల‌ను పక్క‌న పెట్టారు. చేతులు క‌లిపారు. క‌ల‌సి వేదిక‌లు.. వాహ‌నాలు కూడా పంచుకున్నారు. ప‌క్క ప‌క్క‌న నిల‌బ‌డి మీటింగుల్లో ప్ర‌సంగాలు దంచి కొట్టారు. దీంతో ఈ దృశ్య అంద‌రికీ ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయాల్లో మార్పు ఇలా కూడా ఉంటుందా? అని ఆశ్చ‌ర్య ప‌డేలా చేసింది. నారా వారి కుటుంబం.. న‌ల్లారి కుటుంబం ఆదిలో కాంగ్రెస్‌లోనే ఉండేవి. న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి తండ్రి తొలినాళ్ల‌లో కాంగ్రెస్‌లో ఉండేవారు.

ఆయ‌న వార‌స‌త్వంగానే కిర‌ణ్‌కుమార్ రెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అప్ప‌ట్లో కిర‌ణ్ తండ్రి.. నారా చంద్ర‌బాబుకు రాజ‌కీయ గురువు కావ‌డం విశేషం. ఇలా.. సాగిన ప్ర‌స్తానం.. త‌ర్వాత చంద్ర‌బాబు టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో.. మారిపోయింది. అసెంబ్లీ నుంచి ప్ర‌జాక్షేత్రం .. పార్టీల వ‌ర‌కు కూడా.. నిప్పులు చెరిగే నాయ‌కులుగా మారిపోయారు. ఎదురెదురు ప‌డింది లేదు. ప‌డినా ప‌ల‌క‌రించుకున్న‌దీ లేదు. ఇక, ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా(వైఎస్ హ‌యాం) చేసిన న‌ల్లారిపై స‌భ‌లోనే చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ప‌క్ష‌పాతం చూపుతున్నార‌ని.. మైకు ఇవ్వ‌కుండా అడ్డుకుంటున్నార‌ని.. ఆయ‌న వ్యాఖ్యానిస్తే.. మీరే హ‌ద్దులు మీరుతున్నార‌ని నల్లారి ఎదురు దాడి చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ తెలిసిందే.

ఇక‌, న‌ల్లారి ముఖ్య‌మంత్రిగా చేసిన(వైఎస్ మ‌ర‌ణాంత‌రం) స‌మ‌యంలోనూ బాబు వ‌ర్సెస్ న‌ల్లారిల మ‌ధ్య అసెంబ్లీ వేదిక‌గా అనేక సంద‌ర్భాల్లో నిప్పులు కురిశాయి. బాబు విధానాల‌ను న‌ల్లారి తీవ్ర‌స్థాయిలో ఎండ‌గ‌ట్టేవారు. ఇక‌, న‌ల్లారి పాల‌న‌ను బాబు దుయ్య‌బ‌ట్టేవారు.. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. న‌ల్లారి తెలంగాణ‌కు ప‌రిమితం కాగా.. ఏపీలో చంద్ర‌బాబు సీఎం అయ్యారు. ఇక‌, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ద‌రిమిలా.. న‌ల్లారి.. రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు ఇక్క‌డ కూట‌మి ప‌క్షాన‌.. న‌ల్లారిని ప‌క్క‌న పెట్టుకుని మ‌రీ ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం.