మణిపూర్లో బీజేపీకి పెద్ద షాకే తగిలింది

మామూలుగా మిత్రపక్షాలకు బీజేపీ హ్యాండిస్తుంటుంది. కానీ మణిపూర్లో మాత్రం మిత్రపక్షమే బీజేపీకి హ్యాండిచ్చింది. 60 సీట్లున్న మణిపూర్లో చాలా కాలంగా బీజేపీ+నేషనల్ పీపుల్స్ పార్టీతో పాటు మరికొన్ని చిన్నాచితక పార్టీలు మిత్రపక్షాలుగా ప్రభుత్వంలో ఉన్నాయి. అయితే తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీకి 20 సీట్లు మాత్రమే కేటాయించాలని మిత్రపక్షం డిసైడ్ చేసింది. మిత్రపక్షం నిర్ణయంతో బీజేపీతో విభేదించింది. 40:20 రేషియో లో కాకుండా 30:30 రేషియోలో పోటీచేయాలని కమలనాథులు పట్టుబట్టారు.

ఎన్నిసార్లు చర్చలు జరిగినా వీళ్ళ మధ్య సయోధ్య సాధ్యం కాలేదు. దాంతో 20 సీట్లకు మించి మిత్రపక్షానికి ఇచ్చేది లేదని నేషనల్ పీపుల్స్ పార్టీ తెగేసి చెప్పేసింది. దాంతో మండిపోయిన కమలనాథులు మిత్రపక్షానికి గుడ్ బై చెప్పేశారు. అంతేకాకుండా మొత్తం 60 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించేందుకు రెడీ అయిపోయారు. ఇదే సమయంలో బీజేపీ వైఖరి అర్ధమైపోయిన పీపుల్స్ పార్టీ కూడా మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి షాక్ ఇచ్చింది.

దాంతో షాక్ తిన్న బీజేపీ చేసేదిలేక చివరకు 60 సీట్లలో అభ్యర్థులను ప్రకటించేసి ఒంటరిగానే పోటీలోకి దిగబోతున్నట్లు ప్రకటించింది. పోయిన ఎన్నికల్లో కూడా బీజేపీ ఇక్కడ మెజారిటి రాలేదు. కాకపోతే నేషనల్ పీపుల్స్ పార్టీ లాంటి అనేక చిన్నా చితకా పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.  ఇప్పటి ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి పోటీచేద్దామని అనుకున్నా  సీట్ల సర్దుబాటు కుదరలేదు. దాంతో రెండు పార్టీలు విడిపోయినట్లయ్యింది.

ఎన్నికలకు ముందు విడిపోయిన మిత్రపక్షాలు ఎన్నికల తర్వాత మళ్ళీ కలవకూడదనేమీ లేదు. ఎందుకంటే ఏ పార్టీకైనా అధికారం అందుకోవటమే కదా పరమార్ధం. ఈ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగానే ఉంది. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్సే అధికారంలోకి రావాల్సింది. అయితే ఆ పార్టీ సీనియర్ నేతల నిర్లక్ష్యం కారణంగా అధికారాన్ని బీజేపీ ఎగరేసుకుపోయింది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ ముందు జాగ్రత్తపడినట్లే అనిపిస్తోంది. అందుకనే మిత్రపక్షాల విషయంలో కాస్త గట్టిగానే పొత్తులు పెట్టుకుంటోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.