వైసీపీకి.. చంద్ర‌బాబు స‌వాల్‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం.. త‌మ ఎంపీలు.. రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని.. మ‌రి వైసీపీ ఎంపీలు కూడా సిద్ధ‌మేనా? అని స‌వాల్ రువ్వారు. ప్రత్యేక హోదాపై ప్రజలను ఎన్నాళ్లు మభ్యపెడతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆనాడు ప్రజలకు ప్రత్యేక హోదా సాధిస్తామని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే రాజీనామా చేస్తామని చెప్పారన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.

రాజీనామా చేసేందుకు త‌మ పార్టీ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. వైసీపీ ఎంపీలు సిద్ధమా అని స‌వాల్ విసిరారు. `రాజీనామా చేయండి. కలిసి పోరాడదాం` అని పిలుపునిచ్చారు. పరిపాలన అనుభవం లేని సీఎం వల్ల అంతా నష్టమే కలుగుతోందని చంద్రబాబు ఆక్షేపించారు. రోజురోజుకు వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. విశాఖ రైల్వే జోన్పై చాలా మాట్లాడిన జగన్.. నేడు విశాఖ రైల్వే జోన్ లేదని కేంద్రం అంటే ఎందుకు మాట్లాడట్లేదని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై వైసీపీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని ఆక్షేపించారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న జగన్.. ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరంపై అసత్య ప్రచారాలు చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి పోలవరాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. 2021కల్లా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, 2022లో కూడా పోలవరం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ నేత‌లు జోన్‌పై ఎందుకు స‌మాధానం చెప్ప‌లేక పోతున్నార‌ని చంద్ర‌బాబు నిల‌దీశారు. సమాధానం చెప్పలేని సీఎం రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు.. అని నిలదీశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ఏం సాధించారని అన్నారు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరాన్ని పక్కనబెట్టారని, జల వనరులపై అనుభవం లేక పూర్తిగా నాశనం చేశారని దుయ్య‌బ‌ట్టారు. ఫలితంగా చిన్న కాల్వ తవ్వాలన్నా కేంద్రాన్ని అడగాల్సిన పరిస్థితి తలెత్తిందని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.