టీడీపీ అనూహ్య విజయం

ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటిలో తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం సాధించారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కచోట కూడా ప్రభావం చూపలేకపోయిన టీడీపీ దర్శిలో మాత్రం గెలవటం ఆశ్చర్యంగా ఉంది. దర్శి మున్సిపాలిటిలో ఉన్న 20 వార్డుల్లో టీడీపీ 13 చోట్ల గెలవగా అధికార వైసీపీ 7 వార్డుల్లో మాత్రమే గెలిచింది. వెలువడిన ఫలితమే అధికార పార్టీ నేతలను షాక్ కు గురిచేసిందనే చెప్పాలి.

రాష్ట్రంలో ఇపుడు జరిగిన మున్సిపాలిటిల్లో గెలిచి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కనిపించిన వైసీపీ ప్రభంజనం దర్శిలో తిరగబడటమే విచిత్రంగా ఉంది. దర్శిలో టీడీపీ విజయానికి ప్రభుత్వంపై వ్యతిరేకత కాదన్నది అర్ధమవుతోంది. ఎలాగంటే ప్రజా వ్యతిరేకత అన్నది ఉంటే అది మిగిలిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కనబడాలి. కానీ 11 మున్సిపాలిటిలను వైసీపీ స్వీప్ చేసేన ఒక్క దర్శిలో మాత్రమే ఓడిపోయిందంటే ఇక్కడ ఏదో సమస్య కచ్చితంగా ఉండుండాలి.

జిల్లా నుండి అందుతున్న సమచారం ప్రకారం దర్శి ఎంఎల్ఏ మద్దిశెట్టి వేణుగోపాల్ పై వ్యతిరేకత మొదలైపోయింది. ఇదే సమయంలో మాజీ ఎంఎల్ఏ బూచేపల్లి శివప్రసాదరెడ్డితో ఎంఎల్ఏకి విభేదాలు మొదలయ్యాయి. అంతర్గతంగా మంత్రి బాలినేనితో కూడా ఎంఎల్ఏకి పడటం లేదని సమాచారం. అంటే వ్యక్తిగతంగా ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించే క్రమంలో ముగ్గురు కలిసి పార్టీని గాలికొదిలేశారని సమాచారం.

ఎంఎల్ఏ అంటే పడని వైసీపీ నేతలు టీడీపీతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. టీడీపీ గెలుపు కోసం సొంత పార్టీ విజయాన్ని కూడా పణంగా పెట్టడానికి కొందరు వైసీపీ నేతలు రెడీ అయిపోయారు. దీని ఫలితంగానే 13 వార్డుల్లో టీడీపీ గెలవగా వైసీపీ 7 వార్డులతో సరిపెట్టుకోవాల్సొచ్చింది.

అంటే పార్టీ ఓటమికి మంత్రి బాలినేని, ఎంఎల్ఏ వేణుగోపాల్, మాజీ ఎంఎల్ఏ బూచేపల్లి, టీడీపీ నుండి ఈ మధ్యనే వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బాధ్యత వహించాల్సుంటుంది. మరి ఈ ఫలితంపై జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఏదేమైనా ఏ రూటులో విజయం సాధించినా టీడీపీ ఖాతాలో రెండో మున్సిపాలిటి పడిందన్నది వాస్తవం.