టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ బిజెపి ఎంపీలకు సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వాన్ని పెంపొందించాలని కూడా ఆయన చెప్పారు. నిజానికి ఏ రాష్ట్రం గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఈ విధంగా వ్యాఖ్యలు చేయలేదు. పార్టీని బలోపేతం చేయాలని లేదా నాయకుల మధ్య సమన్వయం ఉండాలని కానీ ఈ పది సంవత్సరాల కాలంలో ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించలేదు.

కానీ, దక్షిణాదిపై బిజెపి పెద్ద ఎత్తున లక్ష్యం పెట్టుకుంది. దీనిలో భాగంగానే తెలంగాణ బిజెపిపై నిశితంగా దృష్టి పెట్టింది. కానీ, ఇక్కడి నాయకుల మధ్య కలివిడి లోపిస్తోంది. ఐక్యత అసలు కనిపించడమే లేదు. పైగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేరుగా జోక్యం చేసుకుని అందరూ కలిసిమెలిసి పని చేయాలని.. ఐక్యతకు పెద్దపీట వేయాలని.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని ఆయన చెప్పారు.

కానీ ఆ మార్పు దిశగా తెలంగాణ బిజెపి నాయకులు ఇప్పటివరకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు అన్నది కనిపిస్తుంది. నిజానికి పార్టీ అధిష్టానం చెప్తే ఒక రకంగా ఉంటుంది. కానీ పార్టీలో పెద్దన్నగా, పార్టీని ఒకరకంగా నడిపిస్తున్న నాయకుడిగా మోడీ ఉన్నప్పుడు ఆయన చెప్పిన తర్వాత కూడా కనీసం మార్పులు లేకుండా నాయకులు ఒకరిపై ఒకరు విమ‌ర్శ‌లు చేసుకోవడం విశేషం. అదేవిధంగా ఈటల రాజేందర్ లాంటివాళ్ళు తాము ఏ పార్టీలో ఉండాలో ప్రజలను నిర్ణయిస్తారని చెప్పటం మ‌రో కొస‌మెరుపు.

ఇక‌, కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఈటల రాజేందర్ ను టార్గెట్ చేయడం.. కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అసలు కనిపించకుండా పోవడం ఇలా అనేక సమస్యలు తెలంగాణ బిజెపిని పట్టిపీడిస్తున్నాయని చెప్పాలి. మరి మోడీ చెప్పిన తర్వాత అయినా మారుతుందా అని అందరూ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ దిశగా అయితే అడుగులు ఎక్కడ వేస్తున్నట్టుగా కనిపించడం లేదు. మరి ఎప్పటికీ మారతారు అసలు పట్టించుకుంటారా లేదా మళ్లీ ఎన్నికల వరకు ఇలాగే ఉంటుందా అనేది తెలంగాణ బిజెపి నాయకుల మధ్య చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అత్యంత బలహీనంగా బిజెపి ఉంద‌న్నది స్పష్టంగా తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో బలోపేతం కావాలన్న ప్రధాని లక్ష్యాన్ని వదిలేసి నాయకులు ఎవరికి వారు రాజకీయాలు చేస్తుండడంతో ఈ పరిస్థితి వస్తోందన్న‌ది కూడా వాస్తవం. మరి దీని నుంచి ఏ మేరకు పాఠాలు నేర్చుకుంటారు. మోడీ చెప్పిన తర్వాత కూడా నాయకులు వినిపించుకోకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? అనేది రాజకీయంగా బీజేపీని వెంటాడుతున్న ప్ర‌శ్న‌.