అభిమానుల బాధ‌ను అర్థం చేసుకున్నారు


టాలీవుడ్ నిర్మాణ సంస్థ‌ల్లో సోష‌ల్ మీడియాలో యువి క్రియేష‌న్స్ ఎదుర్కొన్నంత వ్య‌తిరేక‌త‌ను మ‌రే ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా ఎదుర్కొని ఉండ‌క‌పోవ‌చ్చు. ప్ర‌భాస్‌కు హోం బేన‌ర్ అన‌ద‌గ్గ ఈ సంస్థ‌.. అత‌డితో ఇప్ప‌టికే మిర్చి, సాహో సినిమాల‌ను నిర్మించింది. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న రాధేశ్యామ్‌ను నిర్మించింది కూడా యువి వాళ్లే. ఐతే ప్ర‌భాస్ లాంటి బిగ్ స్టార్‌తో సినిమాలు చేస్తూ వాటిని స‌రిగా ప్ర‌మోట్ చేయ‌ర‌ని.. స‌రైన స‌మ‌యంలో అప్ డేట్స్ ఇవ్వ‌ర‌ని.. అభిమానులను ఏమాత్రం ఎంగేజ్ చేయ‌ర‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతుంటాయి.

బాహుబ‌లి త‌ర్వాత భారీ అంచ‌నాల మ‌ధ్య భారీ బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సాహో విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ ఇవ్వ‌ట్లేద‌ని అభిమానులు ఎంత‌గా గ‌గ్గోలు పెట్టారో గుర్తుండే ఉంటుంది. యువి ఆఫీస్ ద‌గ్గ‌రికెళ్లి గొడ‌వ చేసే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది. అయినా స‌రే.. రాధేశ్యామ్ విష‌యంలోనూ యువి వాళ్ల తీరు మార‌లేద‌నే అభిప్రాయాలున్నాయి.

త‌ర‌చుగా యువి క్రియేష‌న్స్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్రోల్ చేస్తుంటారు. రాధేశ్యామ్ రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్నా సినిమా నుంచి పాట‌లు రిలీజ్ చేయ‌ట్లేద‌ని, మ‌రే ర‌క‌మైన అప్ డేట్స్ ఇవ్వ‌ట్లేద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఒక అభిమాని అయితే.. యువి వాళ్లు ప్ర‌భాస్ అభిమానుల బాధ అర్థం చేసుకోవ‌ట్లేద‌ని, అప్‌డేట్స్ ఇవ్వ‌ట్లేద‌ని, తాను ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డుతున్నాన‌ని ఒక లెటర్ రాసి సోష‌ల్ మీడియాలో వ‌ద‌ల‌డం గ‌మ‌నార్హం. ఈ లెట‌ర్ వైర‌ల్ అయ్యేస‌రికి యువి వాళ్లలో క‌ద‌లిక వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు రాధేశ్యామ్ ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు.

న‌వంబ‌రు 15న సినిమా నుంచి తొలి పాట‌ను రిలీజ్ చేయ‌బోతున్నారు. దీంతో అభిమానులు శాంతించారు. ఈ అప్‌డేట్ మీద హ్యాష్ ట్యాగ్ పెట్టి సంద‌డి మొద‌లుపెట్టారు. ఇప్ప‌టికైనా అభిమానుల ఆకాంక్ష‌ల్ని అర్థం చేసుకున్నారంటూ పోస్టులు పెడుతున్నారు. రాధేశ్యామ్ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడ‌దుల కానున్న సంగ‌తి తెలిసిందే.