తెలంగాణ ఎల‌క్ష‌న్స్‌.. జ‌గ‌న్ అడుగులు ఎటు?!

తెలంగాణ ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. అభ్య‌ర్థుల ఎంపిక‌, ప్ర‌చారాల దిశ‌గా అన్ని పార్టీలు వ్యూహ, ప్ర‌తివ్యూహాల తో ముందుకు సాగుతున్నాయి. అయితే.. ఎంత సొంత బ‌లం ఉన్నా.. మ‌రికొంత తోడు దొర‌కాల‌ని, మ‌రింత ద‌న్నుగా త‌మ‌కు మేలు చేసేవారు ఉండాల‌ని కోరుకునే నాయ‌కులు, పార్టీలు క‌నిపిస్తున్నాయి. సామాజిక వ‌ర్గాల వారిగా చూసుకున్నా, స్థానిక‌తను ఆధారంగా చూసుకున్నా.. ఇలా కోరుకోవ‌డం త‌ప్పుకాదు. ముఖ్యంగా ఈ విష‌యంలో అధికార బీఆర్ ఎస్‌, అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్న బీజేపీలు ముందున్నాయ‌ని తెలుస్తోంది.

త‌మ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే పొరుగు రాష్ట్రాల నేత‌ల కోసం ఈ రెండు పార్టీలు కూడా తెర‌వెనుక మంత‌నాలు చేస్తున్నాయని తెలిసింది. ప్ర‌ధానంగా ఏపీ అధికార పార్టీ వైసీపీపై బీఆర్ ఎస్‌, బీజేపీలు ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోంది. అంటే.. తెలంగాణ‌లో ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గంతోపాటు సెటిల‌ర్ల ఓట్ల‌ను త‌మ‌కు అనుకూలంగా ప‌డేలా చేసుకోవాల‌నేది ఈ రెండు పార్టీల వ్యూహంగా ఉంద‌ని స‌మాచారం.

ఈ క్ర‌మంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ త‌మ‌కు అనుకూలంగా ఉండాల‌ని బీజేపీ, బీఆర్ఎస్‌లు కోరుకుంటున్నాయ‌ని తెలుస్తోంది.2014, 2019 ఏపీ ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డాల‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరుకున్నారు. స్వ‌యంగా ప్ర‌క‌టించారు కూడా. ఇక‌, 2019లో అయితే.. బ‌హిరంగ సాయ‌మే వైసీపీకి చేశార‌నే ప్ర‌చారం ఉంది. అంటే.. మొత్తంగా ఏపీలో వైసీపీ స‌ర్కారు ఏర్ప‌డ‌డంతో అంతో ఇంతో బీఆర్ ఎస్ చేయి కూడా ఉంద‌ని అంటారు.

కాబ‌ట్టి.. ఇప్పుడు త‌మ‌కు కూడా వైసీపీ అంతే స్థాయిలో సాయం చేయాల‌నేది బీఆర్ఎస్ మ‌న‌సులో మాట గా చెబుతున్నారు. సెటిల‌ర్లు, వ్యాపార వ‌ర్గాల్లోని రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని త‌మ‌కు అనుకూలంగా న‌డిపిస్తే బెట‌రనేది బీఆర్ఎస్ ఆశ‌. ఇక‌, త‌మ‌కు మిత్రుడిగా ఉన్న జ‌గ‌న్‌.. తెలంగాణ ఎన్నిక‌ల్లో స‌హ‌క‌రించాల‌నేది బీజేపీ పెద్ద‌ల ఆశ‌గా క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న బీజేపీ.. జ‌గ‌న్‌తో ఉన్న అనుబంధం నేప‌థ్యంలో ఆ దిశ‌గా స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో సీఎం,. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? బీఆర్ఎస్‌కు ద‌న్నుగా లోపాయికారీ వ్యూహంతో ముందుకు వెళ్తారా? లేక‌.. బీజేపీకి సాయం చేయ‌డం ద్వారా కేంద్రంలోని పెద్ద‌ల‌ను మ‌రింత ఆక‌ట్టుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు జ‌గ‌న్ ఆయ‌న పార్టీ నేత‌లు.. త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

బీఆర్ఎస్‌కు స‌హ‌క‌రిస్తే బీజేపీకి కోపం, స‌హ‌క‌రించ‌క‌పోతే.. కేసీఆర్‌కు మిత్ర ద్రోహం చేసిన‌ట్టు అవుతుంది. ఇక‌, బీజేపీతోనూ ఇదే ప‌రిస్థితి వైసీపీకి ఉంది. కేంద్రం పెద్ద‌ల ఆగ్ర‌హానుగ్ర‌హాలు రెండూ ఉంటాయి. దీంతో న్యూట్ర‌ల్ రోల్ పాటించ‌డ‌మే బెట‌ర్ అనుకునే ఛాన్స్ ఉంద‌న‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.