ఏపీ టీడీపీకి బంధు గ‌ణ‌మే శాప‌మా?

ఏపీ టీడీపీలో ప్ర‌తి జిల్లాలోనూ నేత‌ల బంధులు, చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితులైన వారి వియ్యంకు లు, బావ‌మ‌రుదులే చ‌క్రం తిప్పుతున్నారు. జిల్లాల‌కు జిల్లాను పంచుకున్న వారి నుంచి నియోజ‌క‌వ‌ర్గాల్లో తిష్ట‌వేసి.. పార్టీని త‌మ క‌నుస‌న్న‌ల్లో న‌డిపిస్తున్న‌వారు ఉన్నారు. పోనీ.. వీరివ‌ల్ల పార్టీ ఏమైనా.. పుంజుకుందా? అంటే.. పెద్ద ప్ర‌శ్నే! మ‌రి ఈ నేత‌ల బంధువుల‌ను ప్రోత్స‌హిస్తున్న చంద్ర‌బాబు ఎప్ప‌టి వ‌రకు ఇలా ఉపేక్షిస్తారు? వారు మైన‌స్ అని తెలిసి కూడా వారివ‌ల్ల పార్టీకి ఎలాంటి ప్ర‌యోజ‌నం లేక‌పోగా.. మ‌రిన్ని ఇక్క‌ట్లు వ‌స్తున్నాయ‌ని తెలిసి కూడా ఆయ‌న ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

ఇలాగే మ‌రో మూడేళ్లు ఉంటే.. పార్టీమ‌రింత‌గా ఇబ్బందుల్లో కూరుకుపోదా? అనే ప్ర‌శ్న‌ల‌కు పార్టీ అధినేత నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు ఎవ‌రూ ఆత్మ ప‌రిశీల‌న కూడా చేసుకోవ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు మాజీ మంత్రి, పార్టీలో చంద్ర‌బాబు త‌ర్వాత నెంబ‌రు 2గా వ్య‌వ‌హ‌రించే నాయ‌కులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు. ఈయ‌న బంధువుల జిల్లాల‌ను పంచేసుకున్నారు. సోద‌రుడు కృష్ణుడు తుని స‌హా చుట్టుప‌క్క‌ల నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రి పార్టీ ఏమైనా బ‌ల‌ప‌డిందా? పోనీ.. ఆయ‌న ఒక్క‌సారంటేఒక్క‌సారైనా గెలిచారా? అంటే.. ఇది లేక‌పోగా.. ఆయ‌న కార‌ణంగా కింది స్థాయి కార్య‌క‌ర్త‌లు, జెండా మోసేవారు సైతం ఇబ్బందులు ప‌డుతున్నారు.

ఇక‌, య‌న‌మ‌ల బంధువు, వియ్యంకుడు పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌ది మ‌రింత చిత్ర‌మైన ప‌రిస్థితి. క‌డ‌ప జిల్లా మైదుకూరు త‌న‌దే అంటారు. టీడీపీ త‌ర‌ఫున ఏం జ‌ర‌గాల‌న్నా.. త‌న‌కే చెప్పాలంటారు. పోనీ.. పార్టీ బ‌లోపేతానికి, నియోజ‌క‌వ‌ర్గంలో పుంజుకోవడానికి, వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న పుంజుకోవ‌డానికి చేసింది ఏమైనా ఉందా? అంటే జీరో! కేవ‌లం య‌న‌మ‌ల ట్యాగ్‌తో పార్టీలో ప‌ద‌వులు ఆక్ర‌మించేసి.. నెట్టుకొచ్చేస్తున్నారు. ఇక‌, గంటా శ్రీనివాస‌రావు. ఈయ‌న‌కు ఇద్ద‌రు వియ్యంకులు ఉన్నారు. వీరిలో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి నారాయ‌ణ. తూర్పుగోదావ‌రిలో ఒక‌రు ఉన్నారు. వీరు కూడా అంతే. పార్టీ ఎదుగుద‌ల‌కు ఒక్క అడుగు ముందుకు వేయ‌క‌పోగా.. త‌మ స్వ‌లాభం తాము చూసుకుంటున్నారు.

ఇక‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు కుమార్తె అదితి. ఈమె దూకుడు చూపించినా.. ఇప్పుడు చ‌ప్ప‌బ‌డిపోయారు. పార్టీని ముందుకు న‌డిపించేందుకు ఎక్క‌డా శ్ర‌ద్ధ తీసుకోవ‌డం లేదు. పోనీ.. త‌నంత‌ట తానుగా ఎదుగుతున్నారా? అంటే అది కూడాలేదు. అనంత‌పురంలో జేసీ కుమారుల ప‌రిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. శ్రీకాకుళంలోనూ ఇలానే ఉంది. కృష్ణాలో గ‌ద్దె కుటుంబం,విజ‌య‌వాడ‌లో కేశినేని నాని ఫ్యామిలీ.. క‌ర్నూలులో భూమా అఖిల ప్రియ కుటుంబం.. తాము త‌ప్ప ఎవ‌రూ రాజ‌కీయాల‌కు ప‌నికిరార‌నే ధోర‌ణి అవ‌లంభిస్తున్నారు. ఇలా చెప్పుకొంటూ.. పోతే.. చాలా మంది ఉన్నారు. మ‌రి వీరిలో ఎంత మంది పార్టీకి ఉప‌యోగ‌ప‌డుతున్నారో.. ఎంత మంది పార్టీని ప‌ట్టుకుని తాము ఎదుగుతున్నారో.. తెలిసి కూడా చంద్ర‌బాబు మౌనం వ‌హించ‌డం .. పార్టీకే న‌ష్ట‌మ‌ని అంటున్నారు టీడీపీ అభిమానులు. మ‌రి ఇప్ప‌టికైనా యుద్ధ ప్రాతిప‌దిక‌న క‌ష్ట‌ప‌డుతున్న‌వారికి అవ‌కాశం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.