‘పుష్ప’ నంబర్ చాలా పెద్దదే..

అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా చిత్రీకరణ గత నెలలోనే తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లిలో మొదలైన సంగతి తెలిసిందే. ఏడాది కిందటే షూటింగ్ అనుకుంటే కరోనా సహా రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఇంత ఆలస్యంగా పట్టాలెక్కింది. ఆలస్యమైతే అయ్యిందని పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగి చకచకా సన్నివేశాల చిత్రీకరణ సాగించాడు సుకుమార్. పీటర్ హెయిన్ నేతృత్వంలో ఒక యాక్షన్ ఎపిసోడ్.. రామ్-లక్ష్మణ్‌ల ఆధ్వర్యంలో మరో యాక్షన్ ఘట్టం చిత్రీకరణ పూర్తి చేశారట. అలాగే రెండు పాటలు, మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగినట్లు తెలుస్తోంది.

అటు ఇటుగా అరగంట దాకా రష్ వచ్చినట్లు సమాచారం. ఇదే ఊపులో ఇంకొన్ని రోజుల పాటు నిర్విరామంగా కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగించాలని అనుకున్నాడు సుక్కు. ఇంతలో కరోనా కలకలం రేగింది యూనిట్లో. దీంతో ప్యాకప్ చెప్పేసి టీం అంతా హైదరాబాద్‌కు వచ్చేయాల్సి వచ్చింది.

ఐతే ఒకరిద్దరికి కరోనా వస్తే వాళ్లను ఐసోలేషన్‌కు పంపించేసి.. సెట్లో శానిటైజేషన్ చేసేసి షూటింగ్ కొనసాగించేవాళ్లే. ఎందుకంటే కోట్ల రూపాయల ఖర్చుతో అక్కడ షూటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే మళ్లీ కంటిన్యుటీ కష్టమవుతుంది. బ్రేక్ ఇస్తే మళ్లీ కొత్తగా ఏర్పాట్లు చేయాలి. ఖర్చు బాగా ఎక్కువవుతుంది. కాబట్టి కొంతమందికి కరోనా వస్తే షూటింగ్ క్యాన్సిల్ అయ్యేది కాదు.

ఐతే ‘పుష్ప’ టీంలో కరోనా బాధితుల సంఖ్య పెద్దదే అని సమాచారం. ఆ సంగతి తూర్పు గోదావరి జిల్లా అధికారుల దృష్టికి వెళ్లిందని, సెట్లో పరిమితికి మించి సంఖ్యలో యూనిట్ సభ్యులు ఉండటం, పెద్ద నంబర్లో కరోనా బాధితులు తేలడంతో షూటింగ్ కొనసాగించడానికి వీల్లేదని.. స్థానికులు సైతం ‘పుష్ప’ టీంతో కలిసి పని చేస్తున్న నేపథ్యంలో వాళ్లందరికీ కరోనా సోకితే సమీప ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో షూటింగ్ ఆపించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చేసేది లేక చిత్ర బృందమంతా హైదరాబాద్‌కు వచ్చేసిందట.