తిరుపతిలో బీజేపీ అప్పుడే ఎందుకు హడావుడి చేస్తోంది ?

తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన తర్వాత బీజేపీ నేతల హడావుడి మొదలైపోయింది. అనూహ్యంగా తెలంగాణాలోని దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి రాష్ట్రంలో హడావుడి చేస్తోందంటే అర్ధముంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ గెలవటం అన్నది జాక్ పాట్ కొట్టినట్లే. ఇక్కడ గెలుస్తామని పైకి ఎన్ని ప్రకటనలు చేసినా లోలోపల మాత్ర కమలం నేతల్లో ఎవరికీ నమ్మకం లేదు. అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించేంత సీన్ నిజానికి బీజేపీకి లేదనే చెప్పాలి.

2018 ఎన్నికల్లో ఇదే సీటులో బీజేపీది మూడోస్ధానం. నిజానికి ఇపుడు కూడా దాని ఒరిజినల్ బలం ఇదే. కాకపోతే కాస్త హడావుడి చేయటం, కమలం నేతలంతా కలిసి దుబ్బాకలో మోహించటంతో వస్తే రెండోస్ధానానికి రావచ్చని అనుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్నది కాబట్టి. పైగా అభ్యర్ధి ఎవరనే విషయాన్ని చివరినిముషం వరకు తేల్చుకోలేకపోయింది. అందుకనే టీఆర్ఎస్ లో నుండి బయటకు వచ్చిన చెరకు శ్రీనివాసరెడ్డిని అభ్యర్ధిగ ప్రకటించింది. ఇలా అనేక కారణాలు కాంగ్రెస్ కు మైనస్ గా నిలిచాయి కాబట్టి బీజేపీ రెండోస్ధానంలో నిలవచ్చనే అనుకున్నారు.

ఓ రకంగా 20-20 ఓవర్ల మ్యాచ్ గా జరిగిన కౌంటింగ్ హోరాహోరీలో చివరకు బీజేపీ అభ్యర్ధి టీర్ఎస్ అభ్యర్ధి సుజాత పై 1170 ఓట్లతో గెలవటం నిజంగా చరిత్రగానే చెప్పుకోవాలి. ఎప్పుడైతే దుబ్బాకలో తమ పార్టీ గెలిచిందే అదంతా తమ పార్టీ బలుపనే కమలనాదులు అనుకుంటున్నట్లున్నారు. సరే కేసీయార్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు కాబట్టి నేతల్లో, శ్రేణుల్లో ఉత్సాహం నింపటం కోసం అందులోను జీహెచ్ఎంసి ఎన్నికలున్నాయి కాబట్టి హడావుడి చేస్తున్నారంటే సరేలే అనుకోవచ్చు.

అయితే అవసరమే లేని తిరుపతి ఉపఎన్నిక విషయంలో ఎందుకు ఇఫ్పటి నుండే హడావుడి మొదలుపెట్టేశారో అర్ధం కావటం లేదు. రాబోయే మార్చినెలలోగా ఉపఎన్నికలు నిర్వహించాల్సుంటుంది. ఈ సీటులో బీజేపీకి అసలు బలమన్నదే లేదు. ఎందుకంటే 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన అందరు కలిసి పోటీ చేసినా వైసీపీ అభ్యర్ధే గెలిచారు. ఇక 2019లో ఎవరికి వారుగా పోటీ చేసినా వైసీపీ అభ్యర్ధే గెలిచారు. నిజానికి తిరుపతి పార్లమెంటు సీటులో గడచిన 30 ఏళ్ళల్లో ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలిచింది. అలాగే బీజేపీ కూడా ఒకేసారి గెలిచింది.

వైసిపి పోటీచేసిన రెండుసార్లు ఆ పార్టీనే గెలిచింది. కాబట్టి రేపటి ఉపఎన్నికల్లో కూడా వైసీపీ గెలుపుకే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. పైగా ఉప ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం సాధారణమే. గడచిన ఏడాదిన్నరలో జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమపథకాలతో పార్టీ మరింత బలోపేతమైందని వైసీపీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. సరే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత హడావుడి ఎలాగూ తప్పదు. కానీ బీజేపీ నేతలు మాత్రం ఇప్పటి నుండే హడావుడి చేసేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రెండుసార్లు తిరుపతిలో పర్యటించారు. రాష్ట్ర ఇన్చార్జి సునీల్ ధియోధర్ పర్యటించారు.

సీనియర్ నేతలే కాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. కేంద్రమంత్రి కాకుండా రాష్ట్ర నేతలు కూడా ఇప్పటికే రెండుసార్లు తిరుపతిలో సమావేశాలు పెట్టేశారు. ఎవరు పర్యటించినా ఉపఎన్నికల్లో పోటీ చేయటం, గెలుపే లక్ష్యంగా పర్యటనలు చేస్తు నేతలు, కార్యకర్తలతో సమావేశాలు పెట్టేస్తున్నారు. ఇంత జరుగుతుంటే పాపం మిత్రపక్షమైన జనసేన మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా జరుగుతున్నది చూస్తున్నది. చూద్దాం చివరకు ఏమవుతుందో.