ప‌వ‌ర్ ప్రాబ్లం : రాత‌లు స‌రే కోత‌లు మాటేంటి?

రాష్ట్రంలో అన‌ధికార కోత‌లు అమ‌లు అవుతున్నాయి. ఇదివ‌ర‌కు కోత‌లు విధించేట‌ప్పుడు సంబంధిత సంస్థ‌ల నుంచి ముంద‌స్తు స‌మాచారం వినియోగ‌దారుల‌కు అందేది. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయిపోయింది.క‌రెంట్ ఎప్పుడు ఉంటుందో, ఉండ‌దో కూడా తెలియ‌ని సందిగ్ధత నెల‌కొని ఉంది.ముఖ్యంగా రెండు రంగాల‌ను ప్ర‌భుత్వం త‌ప్ప‌నిసరిగా ఆదుకోవాల్సి ఉంది. ఒక‌టి వ్య‌వ‌సాయ రంగం,రెండు పారిశ్రామిక రంగం. గ్రామీణ ప్రాంతాల‌లో వ్య‌వ‌సాయ రంగానికి విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఎప్ప‌టిక‌ప్పుడు కోత‌లు వ‌స్తూనే ఉన్నాయి.

అన‌ధికార కోత‌ల కార‌ణంగా గ్రామీణ ఆంధ్రావ‌ని ఇబ్బందులు ప‌డుతూనే ఉంది. లోడ్ రిలీఫ్ పేరిట తీసుకు వ‌చ్చిన నిబంధ‌న‌ల కార‌ణంగా విద్యుత్  స‌ర‌ఫ‌రా అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు నిలిచిపోతోంది.ముఖ్యంగా స‌ర‌ఫ‌రా క‌న్నావాడ‌కం ఎక్కువ‌గా ఉంటోంది.దాంతో న‌గ‌ర ప్రాంతాల‌లో కూడా విద్యుత్ కోత‌లు త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సి వ‌స్తోంద‌ని, పొదుపునకు తాము సూచ‌న‌లు చేస్తూ ఉన్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని సంబంధిత అధికారులు వాపోతున్నారు.

ముఖ్యంగా బొగ్గు నిల్వ‌లు లేక‌పోవ‌డం,దాంతో థ‌ర్మ‌ల్ విద్యుత్ ఉత్ప‌త్తి కేంద్రాలు అనుకున్న విధంగా ఉత్ప‌త్తి ఇవ్వ‌లేక‌పోతున్నాయి. జెన్కో ప్లాంట్ల‌కు ప్ర‌ధానంగా ఇదే స‌మ‌స్య‌గా ప‌రిణ‌మిస్తోంది.మ‌రోవైపు ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బ‌కాయిలు స‌కాలంలో చెల్లించ‌క‌పోవ‌డం కూడా మ‌రో కార‌ణంగా ప‌రిణ‌మిస్తోంది.

ఎన్టీపీసీఎల్ కు 300 కోట్లు ఇవ్వాల్సి ఉంటే క‌నీసం 30 కోట్లు స‌ర్దుబాటు చేయ‌మ‌న్నా చేయ‌లేక‌పోయింది జ‌గ‌న్ స‌ర్కారు.దీంతో ఉత్ప‌త్తి కేంద్రాల నుంచి ఆశించిన రీతిలో ఆంధ్రాకు స‌ర‌ఫ‌రా లేదు.ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ విద్యుత్ కోత‌ల‌ను సులువుగా అధిగ‌మించింది.అదేవిధంగా వ్య‌వ‌సాయ, పారిశ్రామిక రంగాల‌కూ స‌జావుగానే స‌ర‌ఫ‌రా ఇవ్వ‌గ‌లుగుతోంది.కోత‌ల నివార‌ణ‌కు ప్ర‌భుత్వం త‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని విప‌క్షాలు ప‌ట్టుబట్టినా నిధుల లేమి కార‌ణంగా ఆ మాట పైకి చెప్ప‌లేక వైసీపీ ఫెయిల్ అవుతోంది.