మహేష్ కెరీర్లో మూడేళ్ల గ్యాప్ ఎందుకు?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కొంచెం స్పీడుగానే సినిమాలు చేస్తున్నాడు. కరోనా వల్ల మధ్యలో విరామాలు ఎక్కువయ్యాయి కానీ.. అంతకుముందు వరకు అయితే స్పీడుగానే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఏడాదికి కనీసం ఒక్క రిలీజ్ అయినా ఉండేలా చూసుకుంటున్నాడు. కరోనా వల్లే గత ఏడాది మహేష్ సినిమా విడుదల కాలేదు.

అంతకుముందు చాలా ఏళ్లుగా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా చూసుకుంటూ వచ్చాడు. కానీ 2014లో అయితే 1 నేనొక్కడినే, ఆగడు.. ఇలా రెండు సినిమాలు వచ్చాయి మహేష్ నుంచి. ఐతే కొన్నేళ్లుగా ఇలా వేగంగా సినిమాలు చేసుకుపోతున్న మహేష్.. ఒక టైంలో మూడేళ్ల పాటు రిలీజ్ లేకుండా ఉన్నాడంటే ఆశ్చర్యపోవాల్సింది.

అలాగని అతనేమీ రాజమౌళి సినిమాలో లాక్ అయిపోలేదు. 2007లో ‘అతిథి’ వచ్చాక.. 2010లో ‘ఖలేజా’ రావడానికి ముందు మూడేళ్లు వేస్ట్ అయిపోయాయి.ఐతే ఇది అనుకోకుండా వచ్చిన గ్యాప్ ఏమీ కాదని.. తనకు తానుగా విరామం అవసరమని తీసుకున్నదని మహేష్ చెప్పాడు. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’కు అతిథిగా వచ్చిన మహేష్.. ఆ మూడేళ్ల గ్యాప్ గురించి మాట్లాడాడు. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు ముందు ఆహా మరో స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేసింది. అందులో బాలయ్య ఈ ‘గ్యాప్’ గురించి అడగ్గా.. ‘‘బేసిగ్గా ఆ మూడేళ్లు నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి గ్యాప్ తీసుకున్నాను.

ఆ తర్వాత నేను వెనుదిరిగి చూసుకోలేదు’’ అని మహేష్ చెప్పాడు. ఈ మూడేళ్ల విరామానికి ముందు మహేష్ సైనికుడు, అతిథి రూపంలో వరుసగా రెండు ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. గ్యాప్ తర్వాత ‘ఖలేజా’ కూడా ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి వరుస హిట్లతో దూసుకెళ్లాడు. ఇక ఈ ఎపిసోడ్లో మహేష్ తన చిన్నతనంలో అల్లరి గురించి, తన పెళ్లి గురించి కూడా మాట్లాడ్డం విశేషం. బాలయ్య తన డైలాగ్ ఒకటి చెప్పమంటే మీ డైలాగ్స్ మీరు చెబితేనే బాగుంటుందని, ఇంకెవరూ చెప్పలేరని మహేష్ వ్యాఖ్యానించడం విశేషం.