వైసీపీని చిత్తుగా ఓడిస్తారట

ఉప ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తానంటు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలెంజ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఎంపీ ప్రతిపక్ష పార్టీల సహకారంతో నరసాపురం ఎంపీగా మళ్ళీ గెలుస్తానంటు ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 5వ తేదీవరకు తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీకి గడువు ఇస్తున్నట్లు ఎంపీ మరోసారి చెప్పారు. తన రాజీనామాను ఆమోదించవద్దని లోక్ సభ స్పీకర్ కు వైసీపీ లేఖ రాయటాన్ని ఎద్దేవా చేశారు.

తన రాజీనామా అంటేనే అధికార పార్టీ వణికిపోతోందన్నారు. తన రాజీనామా ద్వారా వచ్చే ఉపఎన్నికలో వైసీపీ తరపున ఎవరిని పోటీ చేయిస్తారో చూడాలన్నారు. తన రాజీనామాను ఆమోదించవద్దని వైసీపీ ఎందుకు కోరుతోందో అర్థం కావటం లేదన్నారు. మొత్తానికి ఎంపీది ధీమానో లేకపోతే మేకపోతు గాంభీర్యమో అర్థం కావటం లేదు. తనను సస్పెండ్ చేయటానికో లేకపోతే అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఎంపీ ఆరోపణ కొంతే కరెక్టు. సస్పెండ్ చేయాలని అనుకుంటే ఆ పని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చేసుండేవారు.

ఎంపీపై అనర్హత వేటు వేయించాలన్నదే జగన్ పట్టుదలగా ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎంపీ ఫ్రీ అయిపోతారు. అదే అనర్హత వేటు వేయిస్తే ఎంపీ పదవినే కోల్పోతారు. అందుకనే అనర్హత వేటు వేయించేందుకే గట్టిగా ట్రై చేస్తున్నారు. ఒకవేళ అనర్హత వేటు పడితే మళ్ళీ ఉపఎన్నికలు రావటం ఖాయం. అప్పుడు జగన్, రాజు గారిలో ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది. ప్రతిపక్షాల మద్దతుతో పోటీ చేసి గెలుస్తా అని చెప్పారే కానీ తాను ఏ పార్టీలో చేరుతాననే వియాన్ని మాత్రం ఎంపీ చెప్పలేదు. జరుగుతున్న ప్రచారమైతే జనసేనలో కానీ లేదా బీజేపీలో కానీ చేరుతారని.

పై రెండు పార్టీల్లో దేనిలోనో ఒకదానిలో చేరి టీడీపీ మద్దతు తీసుకుంటారనే ప్రచారం  కూడా జరుగుతోంది. అయితే ఎంపీ ఇపుడు వేసుకుంటున్న ప్లాన్లన్నీ రేపు ఆచరణలోకి వస్తాయనేందుకు గ్యారెంటీ ఏమీ లేదు. బీజేపీలో చేరి పోటీ చేస్తే ఆ పార్టీ నేతలు టీడీపీ మద్దతు తీసుకునేందుకు నిరాకరించవచ్చు. అలాగే జనసేనలో చేరినా ఇదే సమస్య ఎదురైతే ఎంపీ చేయగలిగేదేమీ ఉండదు. ఒకవేళ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి అన్నీ పార్టీల మద్దతు తీసుకోవాలన్నా సాధ్యం కాకపోవచ్చు. అయినా తన గెలుపుపై అంత ధీమా నిజంగానే ఉంటే డెడ్ లైన్లు ఎందుకు వెంటనే రాజీనామా చేసేస్తే పోలా. డైరెక్టుగానే బరిలోకి దిగి తన సత్తా ఏమిటో చూపించి జగన్ నోరు మూయించచ్చు కదా.