స‌జ్జ‌ల రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

ప్ర‌జా ప్ర‌తినిధిగా ఏ ప‌ద‌విలో లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా పార్టీలో జ‌గ‌న్ త‌ర్వాతి స్థానంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఉన్నార‌ని వైసీపీ నాయ‌కులే అంటున్నారు. ప్ర‌భుత్వం త‌ర‌పున పార్టీ త‌ర‌పున విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌నే కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. అంతే కాకుండా విప‌క్షాల కౌంట‌ర్ల‌కు బ‌దులిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా చ‌క్రం తిప్పుతున్న ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌నున్నారా? అనే ప్ర‌చారం ఇప్పుడు జోరందుకుంది. మ‌రి ఇప్పుడు అనుభ‌విస్తున్న హోదాను వ‌ద‌లుకుని ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెళ్తారా అన్న‌ది చూడాలి.

ఆ ఖాళీల‌తో..
ఈ ఏడాదిలో రాజ్య‌స‌భ‌లో మొత్తం 77 మంది స‌భ్యుల ప‌ద‌వీ కాలం పూర్తి కాబోతుంది. అందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న న‌లుగురు ఎంపీలు.. విజ‌య సాయిరెడ్డి, సురేష్ ప్ర‌భు, సుజ‌నా చౌద‌రి, టీజీ వెంక‌టేష్ ప‌ద‌వీ కాలం జూన్ 21 నాటికి ముగుస్తుంది. ప్ర‌స్తుతం రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో ఉన్న బ‌లాబ‌లాల్ని బ‌ట్టి చూస్తే ఆ నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలోకే చేరే అవ‌కాశం ఉంది. ఓ వైపు విజ‌య సాయిరెడ్డి ప‌ద‌వి కొన‌సాగింపుపై ఎలాంటి అనుమానాలు లేవు. ఇక మిగిలిన మూడు స్థాన‌ల్లో కొత్త‌గా ఎవ‌రికి పంపుతాన్న దానిపైనే ఆస‌క్తి మొద‌లైంది.

ఆ క‌ల‌..
కొత్త‌గా ఎవ‌రిని రాజ్య‌స‌భ‌కు పంపుతారు..  ఆ అదృష్టం ఎవ‌రిని వ‌రిస్తుంది? అనేది ఇప్పుడు వైసీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. అయితే ఇప్పుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి పేరు తెర‌పైకి వ‌స్తోంది. జ‌ర్నలిస్టుగా ప్ర‌స్థానం ప్రారంభించి ఆ త‌ర్వాత పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగి రాజ‌కీయ నాయ‌కుడిగా మారి ప్ర‌స్తుతం స‌ల‌హాదారు హోదాలో ఆయ‌న ఉన్నారు. అయితే స‌జ్జ‌ల‌కు రాజ్య‌స‌భ ఎంపీ కావ‌డం ఓ క‌లగా ఉండేద‌ని చెబుతుంటారు. వైసీపీ అధికారంలోకి రాక‌ముందు నుంచి ఆయ‌న ఆ అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తొలి విడ‌త‌లోనే ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ ఆయ‌న‌కు జ‌గ‌న్ స‌ల‌హాదారు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే ప‌క్క‌నే పెట్టుకున్నారు.

ఇప్పుడు వెళ్తారా?
పార్టీలో ప్ర‌భుత్వంలో స‌జ్జ‌ల కీల‌కంగా మారారు. ప్ర‌స్తుతం వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల కంటే కూడా ఆయ‌నే పెత్త‌నం చ‌లాయిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తూనే ఉన్నాయి. పేరుకు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అయిన‌ప్ప‌టికీ.. అంత‌కంటే ఎంతో కీల‌క‌మైన ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వివిధ శాఖ‌ల్లో ఆయా మంత్రుల కంటే కూడా ఎక్కువ‌గా స‌జ్జ‌ల జోక్యం చేసుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంలో చ‌క్రం తిప్పుతున్న ఆయ‌న‌.. ఇప్పుడు ఇవ‌న్నీ వ‌దిలి రాజ్య‌స‌భ‌కు వెళ్లారా? అన్న‌ది అనుమానంగా మారింది.