KTR ఆత్మవిశ్వాసం హద్దు దాటుతోందా?

కొంత కాలం త‌ర్వాత టీఆర్ఎస్ పార్టీలో తాజాగా సంద‌డి క‌నిపించింది. ఆ పార్టీ నేత‌ల ముఖాల్లో ఆనందం ద‌ర్శ‌న‌మిచ్చింది. అందుకు కార‌ణం ఎన్నిక‌లు జ‌రిగిన ఆరు స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించ‌డ‌మే. ఇప్ప‌టికే ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల‌ను టీఆర్ఎస్ ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక 12 స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ స్థానాల‌కు గాను ఆరు ఆ పార్టీకే ఏక‌గ్రీవమ‌య్యాయి. మిగ‌తా ఆరు స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ్గా వాటిలోనే గులాబీ జెండానే ఎగిరింది. దీంతో గులాబి దళం ఫుల్ జోష్‌లో మునిగిపోయింది. ఈ సంతోషంలో ఆ పార్టీ అగ్ర నాయ‌కులు త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు జారీ చేశారు. ఇక మంత్రి కేటీఆర్ అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తిరుగులేద‌ని, పార్టీకి ప్ర‌జ‌లు ప్రతి ఎన్నిక‌ల్లోనూ ప‌ట్టం క‌డుతున్నార‌ని మురిసిపోయారు.

ఆ ఓట‌ములు..
ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 12 స్థానాల‌ను గాను అన్ని సొంతం చేసుకోవ‌డంతో టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజ‌కీయ శ‌క్తి అని మ‌రోసారి నిరూపిత‌మైంద‌ని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ప్ర‌తి ఎన్నిక‌ల్లోనూ పార్టీ ఘ‌న విజ‌యం సాధిస్తూ వ‌స్తోంద‌ని తెలిపారు. అయితే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్య‌ల‌పై విప‌క్షాలు ఎదురు దాడి చేస్తున్నాయి. కేటీఆర్ గ‌తాన్ని మ‌ర్చిపోయి మాట్లాడుతున్నారేమోన‌ని టీఆర్ఎస్ పార్టీకి ముందుంది ముస‌ళ్ల పండ‌గేన‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

2014 ఎన్నిక‌ల్లో తొలిసారి గెలిచిన త‌ర్వాత టీఆర్ఎస్‌కు తిరుగులేద‌ని అంతా అనుకున్నారు. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లోనూ అదే నిజ‌మైంది. కానీ గ‌తేడాది కాలంగా ఆ పార్టీ ప‌రిస్థితి మారింది. బీజేపీ, కాంగ్రెస్ పుంజుకునే ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో కారు పార్టీ వెన‌క‌బ‌డింది. అందుకు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల ఫ‌లితాలే నిద‌ర్శ‌న‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇక స‌వాలే..
దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్‌పై గెలిచిన బీజేపీ రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా బండి సంజ‌య్ రాష్ట్ర అధ్య‌క్షుడ‌య్యాక ఆ పార్టీ జోరు పెరిగింది. ఇక ఇటీవ‌ల కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఈట‌ల రాజేంద‌ర్ విజ‌యంతో బీజేపీ దూకుడు మ‌రింత పెరిగింది. ఇప్పుడా పార్టీ టీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న నేత‌ల‌ను అక్కున చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న నాయ‌కుల‌పై క‌న్నేసింది. మ‌రోవైపు టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కం త‌ర్వాత కాంగ్రెస్ కూడా ప‌రుగులు పెడుతోంది. ఇక మ‌రోవైపు వ‌రుస‌గా రెండు సార్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. కేసీఆర్ ఇచ్చిన హామీల‌ను మ‌ర్చిపోవ‌డం.. నిరుద్యోగుల‌ను ప‌ట్టించుకోవ‌డం, వ‌రి కొనుగోళ్ల వివాదం, ద‌ళిత బంధు ఊసు ఎత్త‌క‌పోవ‌డం ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌పై మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి హ్యాట్రిక్ న‌మోదు చేయ‌డం ఆ పార్టీకి అంత సులువేం కాదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.