అమరావతి రైతులపై మరోసారి వైసీపీ కక్ష సాధింపు

ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో రాజధాని మహిళలు, రైతులు చేపట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్రకు విశేష స్పందన వస్తోన్న సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా రైతులు, మహిళలు ఈ మహా పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేస్తున్న రైతులకు సంఘీభావంగా కొందరు వారికి సహాయం చేస్తున్నారు.

అయితే, పాదయాత్ర చేస్తున్న రైతులను నిబంధనల పేరుతో పోలీసులు, వైసీపీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు… నిన్న లోక్ సభలో కూడా ప్రస్తావించారు. అయినప్పటికీ పాదయాత్ర చేస్తున్నవారిపై వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమర్శలు వస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఎంపేడు వద్ద అమరావతి రైతులపై మరోసారి వైసీపీ నేతలు దాష్టీకాన్ని ప్రదర్శించిన వైనం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఎంపేడు మీదుగా పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా అమరావతి రైతులు భోజనం తినేందుకు వీలుగా ఓ రైతు తన పొలాన్ని ఇచ్చాడు. అయితే, అక్కడ భోజన ఏర్పాట్లు చేయడానికి వీలులేదంటూ ఆ స్థలాన్ని స్థానిక వైసీపీ నేత, సర్పంచ్ ట్రాక్టర్ తో  దున్నించారు. దీంతో, ఆ ప్రాంతంలో కూర్చొని భోజనం చేయడానికి వీలు లేకుండా పోయింది.

కావాలనే ఇలా కక్ష సాధింపునకు పాల్పడ్డారని, పాదయాత్రకు వస్తున్న విశేష స్పందనను చూసి ఓర్వలేకే ఇలా చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతిలో ఉన్న న్యాయస్థానం నుంచి మొదలుబెట్టిన ఈ మహా పాదయాత్రను కలియుగ వెంకన్న దైవం కొలువైన దేవస్థానం తిరుపతివరకు కొనసాగించి తీరతామని రైతులు చెబుతున్నారు