టార్గెట్ చంద్ర‌బాబు.. వైసీపీ వేసిన వ్యూహం ఇదే!

Chandrababu

టార్గెట్ చంద్ర‌బాబు.. కేంద్రంగా.. వైసీపీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క అడుగులు వేసింది. వైసీపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. నిన్న‌టి వ‌ర‌కు కూడా.. అసెంబ్లీ నిర్వ‌హ‌ణ విష‌యంలో మొండి ప‌ట్టుద‌ల‌కు పోయిన‌.. వైసీపీ ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా అది కూడా అనూహ్యంగానే నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల‌ను ఆది నుంచి కూడా ఒక్క‌రోజుకే ప‌రిమితం చేయాల‌ని.. ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. ఆరు మాసాల‌కు ఒక‌సారి.. స‌భ‌ను నిర్వ‌హించాల‌నే కార‌ణంగా రేప‌టితో(న‌వంబ‌రు 19) ఆరు మాసాల గ‌డువు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో క‌నీసం ఒక్క‌రోజు నిర్వ‌హించి మ‌మ అనిపించాల‌ని అనుకుంది.

అయితే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మాత్రం.. దీనికి భిన్నంగా.. 15 రోజులైనా స‌భ‌ను నిర్వ‌హించాల‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అనేకం ఉన్నాయ‌ని.. వాట‌న్నింటినీ.. స‌భ‌లో చ‌ర్చించాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. అయిన ప్ప‌టికీ.. వైసీపీ ప్ర‌భుత్వం ససేమిరా అంది. దీంతో ఏకంగా.. టీడీపీ ఒక్క‌రోజు స‌భ‌కు తాము హాజ‌ర‌య్యేది లేద‌ని మీడియాకు స్ప‌ష్టం చేసింది. ఈ వివాదం కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే.. మునిసిపాలిటీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. రాష్ట్రంలో తాజాగా 12 మునిసిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వీటిలో ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలు జ‌రిగాయి.

ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓడిపోయి.. వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. గడిచిన నాలుగు ద‌శాబ్దాల్లో.. చంద్ర బాబు కంచుకోట‌లోటీడీపీయేత‌ర పార్టీ పాగా వేయ‌డం.. ఇదే తొలిసారి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు క‌ళ్ల‌లో బాధ‌ను చూడాల‌నే ఏకైక కార‌ణంగా.. ఆయ‌న‌ను స‌భావేదిక‌గా ఆట‌ప‌ట్టించాల‌నే ఏకైక ల‌క్ష్యంతో వైసీపీ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకుంది. స‌భ‌ను ఒక‌రోజు నుంచి ఏకంగా.. ఆరు రోజుల‌కు పొడిగించింది. ఈ నెల 26 వ తేదీ వ‌ర‌కు స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని.. స్పష్టం చేసింది. అంతేకాదు.. స‌భ ప్రారంభానికి ముందు.. నిర్వ‌హించిన బీఏసీ స‌మావేశంలోనే ముఖ్య‌మంత్రి ఈవిష‌యాన్ని ప్ర‌స్తావించారు. సో.. దీనిని బ‌ట్టి.. అసెంబ్లీ ప‌నిదినాల‌ను అనూహ్యంగా పెంచ‌డం వెనుక ఉన్న వ్యూహం ఏంట‌నేది స్ప‌ష్ట‌మైంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో విద్యుత్ చార్జీ ల పెంపు, పెట్రోల్ ధ‌ర‌ల పెంపు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు.. ఇసుక ల‌భ్య‌త‌, పెట్టుబ‌డులు, అక్ర‌మాలు.. పోలీసుల దూకుడు వంటి అనేక స‌మ‌స్య‌ల‌తోపాటు.. రైతుల స‌మ‌స్య‌ల‌ను కూడా ప్ర‌స్తావించాల‌నేది టీడీపీ వ్యూహం. అయితే.. వైసీపీ వ్యూహం అంతా కూడా రాజ‌కీయంగానే జ‌ర‌గ‌నుంద‌ని స్ప‌ష్టమైంది. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌లు.. చంద్ర‌బాబు దీక్ష‌, కేంద్రంలో ఆయ‌న ప‌రువు.. ఇలా.. కొన్ని వివాదాస్ప‌ద అంశాల‌నే వైసీపీ అజెండాగా తీసుకునే అవ‌కాశం ఉంది. మొత్తంగా ఏం జ‌రుగుతుందో చూడాలి.