సారూ మీరు మారిపోయారు… తెలుగు తమ్ముళ్లు!

‘దేవుడికైనా దెబ్బె గురువు’అన్నారు. ఈ సామెత అచ్చంగా రాజకీయ నేతలకు సరిపోతుంది. అధికారాన్ని దక్కించుకుని పీఠంపై కూర్చున్న తర్వాత అన్ని మర్చిపోతారు. అధికారంలో ఉన్నప్పుడు ఆకాశంలో విహరించే నేతలు.. అధికారాన్ని కొల్పోయిన తర్వాత నేలపైకి చూపు సారిస్తారు. ఇది అన్ని పార్టీల నేతలు చేసే పనే. కాస్తా అటుఇటూగా అందరూ ఇలాగే వ్యహరిస్తుంటారు. విజయం వెనుక ఉన్న కార్యకర్తలను మర్చిపోతారు. ఎన్నికలకు ముందు కార్యకర్తలను గుండెలకు హత్తుకునే నేతలు… ఎన్నికల తర్వాత దూరంగా విసిరివేస్తారు. ఇదే విషయాన్ని ఇప్పుడు టీడీపీ తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమను అధినేత చంద్రబాబు పట్టించుకోలేదని, పీఠం దిగిన తర్వాత పూర్తిగా మారిపోయారని చెబుతున్నారు. మార్పు మంచిదే అంటున్నారు. కానీ ఇలాగే కలకలం ఉండాలని కోరుకుంటున్నారు.

ప్రస్తుతం చంద్రబాబు కార్యకర్తలందరినీ ఏకం చేస్తున్నారు. సడన్ గా వచ్చిన మార్పుతో తమ్ముళ్లు ఉబ్బితబ్బివుతున్నారు. రెండు రోజుల కొకసారి క్షేత్రస్థాయి సాదారణ కార్యకర్తలతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు. పూర్తిగా తన స్టైల్‌ను మార్చి కార్యకర్తలతో పరిస్థితులు బట్టి ఫోన్లో సంభాషిస్తున్నారు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో అయితే రోజుకు ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నట్లు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందుకు భిన్నంగా ఉండడం రాజకీయ పార్టీల్లో మామూలే. అన్నిపార్టీల్లో ఇలాంటి చర్చ సాగుతుంటుంది.

అన్ని పార్టీల్లోలాగే టీడీపీలో కూడా ఇలాంటి తంతే నడుస్తోంది. గతానికి భిన్నంగా చంద్రబాబు కార్యకర్తలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో నియోజకవర్గ నేతలో పాటు కార్యకర్తలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. పార్టీలో పనిచేసే నేతలతో పాటు కార్యకర్తల టచ్ లోకి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది వస్తే నేరుగా చంద్రాబాబే ఫోన్ చేసి మాట్లాడి ధైర్యాన్ని నూరి పోస్తున్నారు. తానున్నాంటూ భరోసా ఇస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళా కార్యకర్తకు నామినేషన్ వేసే సమయంలో ఇబ్భంది వస్తే నేరుగా చంద్రబాబు మాట్లాడి ధైర్యంగా ఉంటాలని చెప్పారు. అలాగే కుప్పంలో ఓ కార్యకర్తలకు కూడా ఫోన్ చేసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారట. కార్యకర్తలతో అధినేత మాట్లాడుతున్న కాల్ రికార్డులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తమ నాయకుడు మారిపోయారంటూ తమ్ముళ్లు వైరల్ చేస్తున్నారు.

ఏపీలో టీడీపీకి దాదాపు 60 లక్షలకు పైగా కార్యకర్తలున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకున్న నాథుడే లేడని చెబుతున్నారు. పార్టీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా తమను కరివేపాకులా తీసివేసే వారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు చంద్రబాబే స్వయంగా కార్యకర్తలను పలకరిండంతో పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోందట. ఇదేదో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే వ్యహరించి ఉంటే బాగుండేదని, ఈ పని అప్పుడు కూడా చేసింటే ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితి వచ్చేది కాదని తమ్ముళ్లు వాపోతున్నారు. చంద్రబాబు ఇంత చేస్తున్నా.. కార్యకర్తలు మాత్రం పెదవి విరుస్తున్నారట. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇలా చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఉంటారా? అని మౌనంగా ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. అవసరం ఉన్నప్పుడు ఓ విధంగా అవసరం తీరిపోయిన తర్వాత మరోలా వ్యవహరించడంపై టీడీపీలో చర్చ జరుగుతోందట. తమను వాడుకుని వదిలేకుండా ఇలాగే పట్టించుకుంటే పార్టీకి అండగా ఉంటామని తమ్ముళ్లు చెబుతున్నారు.