ఎమ్మెల్సీలు 6.. ఆశావహులు 60 మంది.. కేసీఆర్‌ కు ఇబ్బందే !

టీఆర్‌ఎస్ ను శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ అన్ని పార్టీల నుంచి వలసలను ఆహ్వానించారు. పార్టీలో చేర్చుకునే సమయంలో నేతలకు ఆయన అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చే సమయం వచ్చింది. వలస నేతలు పదుల సంఖ్యలో ఉన్నారు. కానీ ఒకట్ల సంఖ్యలో పదవులున్నాయి. ఆశావాహులు అధికం… పదవులు మాత్రం స్వల్పం. ఇందులో ఎవరిని ఎంపిక చేయాలి.. ఎంపికలో ఏమాత్రం తేడా వచ్చిన సదరు నేతలు గోడ దూకే ప్రమాదం ఉందనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ కు ముందు నుయ్యి. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఎదురవుతోంది. ఆశావాహులను శాంతిపజేసి కేసీఆర్ రాచబాటలో వెళ్తాలో లేక ఇబ్బందులు ఎదుర్కుంటారో వేచి చూడాలి.

తెలంగాణలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. ఎలాంటి పోటీ లేకుండానే ఎమ్మెల్సీలను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. అన్ని స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలోనే జమవుతాయి. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడ్డింది. కేసీఆర్ కు ఇక్కడే ముందరి కాళ్ల బంధం అడ్డుపడుతోంది. ఖాళీ అయిన ఎమ్మెల్సీలు ఆరుగురు. కానీ ఆశావాహులు అరవై మంది ఉన్నారు. ఈ ఆరుగురి ఎంపికలో కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకరిని లేదా ఇద్దరిని శాంతింపజేయచ్చు. కాని ఇంత మందిని సంతృప్తి పర్చడం సాధ్యం కాదు. పార్టీలోకి ఆహ్వనించే సమయంలో వలస నేతలకు ఎమ్మెల్సీ పదవులు, పార్టీలో సముచితన స్థానం కల్పిస్తామని హామీలు ఇచ్చారు. ఎమ్మెల్సీగా చూసుకోవాలని వలస నేతలతో పాటు స్వంత పార్టీ నేతలు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయిన ఆరుగురు టీఆర్ఎస్ సభ్యులే. ఈ ఆరుగురు కూడా రెన్యువల్ చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. వీరిలో ఇద్దరి స్థానాలు పధిలమేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఈ ఇద్దరు ఒకరు గుత్తా సుఖేందర్ రెడ్డి, మరొకరు కడియం. అయితే నేతి విద్యాసాగర్, బొడకుంటి వెంకటేశ్వర్లు, ఆకుల లలిత, ఫరీదుద్దీన్ కు ఈ సారి మొండి చేయి చూపే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. శ్రీహరి. టీఆర్‌ఎస్ లో చేరి ఒకసారి ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టిన నేతలను తిరిగి ఎమ్మెల్సీలుగా పంపే అవకాశం లేదని చెబుతున్నారు. తీగల కృష్ణారెడ్డి, ఎల్బీ నగర్ రామ్మోహన్ గౌడ్, కొత్త మనోహర్ రెడ్డి, బండి రమేష్, బొంతు రాంమ్మోహన్ , మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్ రేసులో ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఎల్. రమణ, ఇనుగాల పెద్దిరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ ఇద్దరు కూడా తమకు ఈ సారి ఛాన్స్ ఇస్తారని ఎదురుచూస్తున్నారు.

వీరితో పాటు మండవ వెంకటేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కర్నె ప్రభాకర్ వంటి వారందరూ రేసులో ఉన్నారు. ఇక తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న దేశపతి శ్రీనివాస్, గ్యాదరి బాలమల్లు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్‌లో అన్ని సర్వేలు ఈటల రాజేందర్ గెలుస్తారని చెబుతున్నాయి. అనుకున్నట్లు ఫలితాల్లో టీఆర్‌ఎస్ కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే.. మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆశావాసులు భంగపడితే టీఆర్‌ఎస్ కు నష్టమేనని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీల వైపు చూసిన ఆశ్యర్యపోనవసరం లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ తరహాలో ఇప్పటికే కొంత మంది సంకేతాలు పంపుతున్నారని గులాబి నేతలు చెబుతున్నారు. అందువల్ల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపీక కేసీఆర్ కు సవాల్ గా మారింది. ఆయన తన చాణక్యంతో అందరినీ సంతృప్తి పర్చుతారో లేక ఆశాభంగానికి గురవుతారో వేచి చూడాలి.