ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు కనిపించాయి. టీడీపీ ఓటమి, వైసీపీ గెలుపు ఎన్నికలకు ముందే ఖరారైపోయిందన్నది స్పష్టం.

కానీ టీడీపీ అంత చిత్తుగా ఓడిపోతుందని.. వైసీపీ ఏకంగా 151 సీట్లు సాధిస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఐతే అప్పుడు అంతటి విజయం సాధించిన జగన్ సర్కారు.. ఐదేళ్ల పాలనతో టీడీపీని మించి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న గ్రామీణుల్లో చాలా వరకు జగన్ వైపు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. మిగతా వర్గాల్లో చాలా వరకు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తుంటే.. కూటమి జయకేతనం ఎగురవేయబోతున్న అంచనాలు కలుగుతున్నాయి. మెజారిటీ సర్వేలు కూడా ఇదే సూచిస్తున్నాయి.

కాగా అసలు ఎన్నికల సమరం జరగడానికి వారం ముందే.. ఒక మినీ ఎన్నికలు జరిగిపోయాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న.. ఎన్నికల రోజు అందుబాటులో ఉండని ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగానే ఒక వేవ్ కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉద్యోగులు కొంతమంది ఓటు వేయడాన్ని లైట్ తీసుకునేవారని.. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా ఓటు వేయాలని వచ్చారని.. మండుటెండల్లో చాలాసేపు లైన్లలో నిలబడి ఓటు వేశారని.. వాళ్లందరిలో జగన్ సర్కారును దించాలనే కసి కనిపించిందని పోస్టల్ బ్యాలెట్ సరళిని గమనించిన వారు చెబుతున్నారు.

జగన్ సర్కారు తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్గాల్లో ఉద్యోగులు ముందు వరసలో ఉంటారు. సీపీఎస్ రద్దు విషయంలో మోసపోయి.. సమయానికి పీఆర్సీలు అమలు కాక.. కనీసం ఒకటో తారీఖున జీతాలు కూడా సరిగా చెల్లించక.. ఇంకోవైపు తమ పీఎఫ్ డబ్బులకూ గ్యారెంటీ లేక.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక.. ఉద్యోగుల్లో జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొన్న మాట వాస్తవం.

ఈ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లలో చాలా వరకు కూటమి వైపే నిలిచినట్లు భావిస్తున్నారు. రేప్పొద్దున అసలు ఎన్నికల్లో కూడా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు జగన్ సర్కారుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తారని అంచనా వేస్తున్నారు.