రోజా కామెంట్ల‌కు గెట‌ప్ శీను స‌మాధానం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రించిన జ‌బ‌ర్ద‌స్త్ షోలో స్కిట్లు చేసే క‌మెడియ‌న్ల‌తో ఆమెకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఆ క‌మెడియ‌న్ల‌లో ఎవ్వ‌రూ ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీకి అనుకూలంగా లేరు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యం వ‌హిస్తున్న జ‌న‌సేన పార్టీకే ప్ర‌చారం చేస్తున్నారు. హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్ర‌సాద్, గెట‌ప్ శీను.. ఇలా చాలామంది క‌మెడియ‌న్లు జ‌న‌సేన కోసం గ్రౌండ్ లెవెల్లో క్యాంపైనింగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదే విష‌య‌మై రోజాను ఇటీవ‌ల అడిగితే.. మెగా ఫ్యామిలీకి ఎదురు వెళ్తే ఇండ‌స్ట్రీలో లేకుండా చేస్తారనే భ‌యంతోనే వాళ్లంతా జ‌న‌సేన‌కు ప్ర‌చారం చేస్తున్నార‌ని వ్యాఖ్యానించింది. వాళ్ల‌తో వేరే వాళ్లు వైసీపీకి వ్య‌తిరేకంగా మాట్లాడిస్తున్నార‌ని కూడా ఆమె పేర్కొంది.

ఈ కామెంట్ల‌పై తాజాగా గెట‌ప్ శీను స్పందించాడు. తాను హీరోగా న‌టించిన రాజు యాద‌వ్ మూవీ ట్రైల‌ర్ లాంచ్ సంద‌ర్భంగా రోజా కామెంట్ల‌కు అత‌ను స‌మాధానం ఇచ్చాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద అభిమానం ఉంది కాబ‌ట్టే తామంతా జ‌న‌సేన‌కు ప్ర‌చారం చేశామ‌ని గెట‌ప్ శీను స్ప‌ష్టం చేశాడు. అస‌లు త‌మ‌ను ఎవ్వ‌రూ పార్టీ త‌ర‌ఫున పిల‌వ‌లేద‌ని.. ఒత్తిడి తేలేద‌ని.. స్వ‌చ్ఛందంగా వెళ్లి జ‌న‌సేన కోసం ప్ర‌చారం చేసిన‌ట్లు శీను తెలిపాడు.

మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల కంటే తాను బ‌య‌టి హీరోల సినిమాల్లోనే ఎక్కువ పాత్ర‌లు చేశాన‌ని.. ఎన్టీఆర్, నాని, వెంక‌టేష్ ఇలా చాలామంది హీరోల‌తో క‌లిసి సినిమాలు చేశాన‌ని గెట‌ప్ శీను చెప్పాడు. పిఠాపురంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్ల జ‌నంలో ఎంతో అభిమానం ఉంద‌ని.. అక్క‌డ ఆయ‌న‌ ల‌క్ష మెజారిటీతో గెలుస్తాడ‌ని గెట‌ప్ శీను చెప్పాడు.

రాజు యాద‌వ్ సినిమా విష‌యానికి వ‌స్తే.. గెట‌ప్ శీను తొలిసారి హీరోగా న‌టించిన సినిమా ఇది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.