టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ మ‌ళ్లీ రేగిన మంట‌లు.. దీక్ష‌ల‌కు రెడీ!

ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య రేగిన వివాదం ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా క‌నిపించ‌డం లేదు. ఒక‌రిపై ఒక‌రు వ్యాఖ్య‌లు చేసుకోవ‌డంతోపాటు.. పోటా పోటీ కార్య‌క్ర‌మాలకు పార్టీలు శ్రీకారం చుట్టాయి. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ప్ర‌దానా కార్యాల‌యంపై జ‌రిగిన దాడి ద‌రిమిలా.. చోటు చేసుకున్న ప‌రిణామాల్లో ఇటు టీడీపీ నాయ‌కులు.. అటు వైసీపీ నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు దూష‌ణ‌లు కొన‌సాగించారు. అరెయ్‌.. అంటే అరెయ్‌! అంటూ.. నాయ‌కులు దూష‌ణ‌ల ప‌ర్వాన్ని కొన‌సాగించారు. నిజానికి ఒక ఘ‌ట‌న త‌ర్వాత‌.. అధికారంలో ఉన్న పార్టీ కొంత వెన‌క్కి త‌గ్గ‌డం స‌హ‌జం. అదేస‌మ‌యంలో జ‌రిగిందేదో జ‌రిగిపోయింద‌ని.. ప్ర‌తిప‌క్షం కూడా శాంతి మంత్రం ప‌ఠించ‌డం.. ఇత‌ర రాష్ట్రాల్లో మ‌నం చూస్తూనే ఉన్నాం.

కానీ, ఏపీలో అలాంటివాతావ‌ర‌ణం క‌నిపించ‌క‌పోగా.. మ‌రింత‌గా రెండు ప‌క్షాలూ రెచ్చ‌గొట్టుకునే ప‌రిస్థితికి దిగ‌జారిపోయాయ‌నే వాద‌న వినిపిస్తోంది. మంగ‌ళ‌గిరిలో మంగ‌ళ‌వారం జ‌రిగిన దాడి త‌ర్వాత‌.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తొలిసారి రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చారు. వాస్త‌వానికి బంద్‌ల‌కు.. ధ‌ర్నాల‌కు పూర్తి వ్య‌తిరేకిగా పేరు తెచ్చుకున్న చంద్ర‌బాబు.. త‌న జీవితంలోనే తొలిసారి రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఇది నిజానికి ఆవేద‌న‌తో కూడుకున్న వ్య‌వ‌హారం.. పైగా రాష్ట్ర పార్టీ కార్యాల‌యంపైనే వైసీపీ దాడులు చేసిన‌ప్పుడు.. చూస్తూ..కూర్చుంటే.. పార్టీ కేడ‌ర్‌లో నిరాశ‌, నిస్పృహ‌లు పెరిగిపోయి.. పార్టీపై వ్య‌తిరేక‌త పెరుగుతుంద‌నే ఆందోళ‌న‌తో రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వ‌డం.. పెద్ద త‌ప్పేమీ కాదు.

కానీ, అదేస‌మ‌యంలో అధికార వైసీపీ కూడా అదే దూకుడు చూపించింది. మేం మాత్రం త‌క్కువా.. అంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు నిర్వ‌హించాల‌ని.. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ‌ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. దీనిని సాక్షాత్తూ మంత్రులే ద‌గ్గ‌రుండి నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో టీడీపీ జెండాల‌ను త‌గుల బెట్టారు. చంద్ర‌బాబు దిష్టిబొమ్మ‌ల‌ను, లోకేష్ దిష్టి బొమ్మ‌ల‌ను త‌గ‌ల‌బెట్టారు. దీంతో వివాదం స‌ర్దుమ‌ణుగుతుందిలే అనుకున్న ప్ర‌జాస్వామ్య వాదుల‌కు చుక్కెదురైంది. దీంతో వ‌రుస‌గా రెండో రోజూ అంటే.. మంగ‌ళ‌, బుధ‌వారాలు .. రాష్ట్రం అట్టుడికింది. నాయ‌కుల దూష‌ణ ప‌ర్వాలు కొన‌సాగాయి. ఎక్క‌డ ఏంజ‌రుగుతుందో తెలియ‌ని ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

స‌రే.. అక్క‌డితో అయినా.. ప‌రిస్థితి స‌ర్దుమ‌ణుగుతుందిలే అనుకున్నా.. ఇప్పుడు మ‌రింత‌గా .. వైసీపీ నేత‌లు రెచ్చిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న పార్టీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని జాతీయ స్థాయిలో వినిపించేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గురువారం ఉద‌యం 8 గంట‌ల నుంచి శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు.. నిర‌స‌న దీక్ష చేప‌ట్ట‌నున్నారు. అంటే 36 గంట‌ల పాటు.. దీక్ష చేయ‌నున్నారు. ఇదే క్ర‌మంలో జిల్లాల్లోనూ నాయ‌కులు దీక్ష చేయాల‌ని పిలుపునిచ్చారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న చేసింది. మేం మాత్రం త‌క్కువా అనుకుందో ఏమో..

గురువారం, శుక్ర‌వారం.. రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా.. టీడీపీ నేత ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ.. ‘జనాగ్ర‌హ దీక్ష‌’ల‌కు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూదీక్ష‌లు చేప‌ట్టాల‌ని.. నాయ‌కుల‌కు.. కార్య‌క‌ర్త‌ల‌కు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. సో.. దీనిని బ‌ట్టి వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య నెల‌కొన్న వివాదం ఇప్ప‌ట్లో చ‌ల్లారే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ఈ రెండు పార్టీల‌నూ చ‌ల్లార్చేందుకు.. స‌ర్దుబాటు చేసేందుకు ‘పెద్ద‌లు’ అనేవారు లేక‌పోవ‌డం మ‌రింత దారుణంగా మారింది.