కరోనా ఎఫెక్ట్.. ప్రపంచం ఎక్కడుంది?

కరోనా వైరస్ విషయంలో ఇంతకుముందు ప్రపంచ వార్తల మీదే అమితమైన ఆసక్తి ఉండేది. మన దగ్గర ఈ మహమ్మారి ప్రభావం పెద్దగా లేని సమయంలో ఎక్కడ ఏ దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఎక్కడ మరణాలు ఎక్కువన్నాయంటూ ఆసక్తిగా చూసేవాళ్లు. అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా ఉద్ధృతి గురించి తెగ చర్చించుకునేవాళ్లం. కానీ గత నెల రోజుల్లో కథ మారిపోయింది. మన దగ్గర వైరస్ విజృంభణ మొదలయ్యాక మన బాధలతోనే సరిపోయింది.

ప్రపంచం గురించి పట్టించుకోవడం మానేశాం. ఇండియాలోనే ఇప్పుడు ఏకంగా లక్షా 12 వేల కేసులు, 3500 దాకా మరణాలు నమోదయ్యాయంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎలా ఉంది.. ఎన్ని కేసులు నమోదయ్యాయి.. మరణాలు ఎన్ని ఏ దేశంలో పరిస్థితి ఏంటి? ఒకసారి పరిశీలిద్దాం.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఏకంగా అరకోటికి చేరడం గమనార్హం. అందులో అత్యధికంగా 15 లక్షల మందికి పైగా బాధితులున్నది ఒక్క అమెరికాలోనే. వరల్డ్ వైడ్ మొత్తం కరోనా మరణాలు 3 లక్షల 26 వేలు కాగా.. అమెరికాలో మాత్రమే 90 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐతే ఓవరాల్‌గా నంబర్ పెద్దదైనా అమెరికాలో ఇప్పుడు కరోనా చాలా వరకు అదుపులోకి వచ్చినట్లే అంటున్నారు. ఇంతకుముందు కరోనా విలయ తాండవం చేసిన యూరప్ దేశాలు ఇటలీ, స్పెయిన్‌ల్లోనూ పరిస్థితి మెరుగైంది. ఐతే ఇప్పుడు కరోనా ధాటికి ఎక్కువగా బాధ పడుతున్నది బ్రెజిల్, రష్యా దేశాలే.

అక్కడ రోజూ వందల్లో కరోనా మరనాలు సంభవిస్తున్నాయి. బ్రెజిల్‌లో ఒక్క రోజులో 1200 మంది దాకా ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. రష్యాలో సైతం కొన్ని రోజులుగా ప్రతి దినం 500కు తక్కువ కాకుండా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ మరణాల రేటుతో పోలిస్తే భారత్ ఇప్పటికీ చాలా మెరుగనే అంటున్నారు. ఐతే బుధవారం దేశవ్యాప్తంగా ఏకంగా 5,600కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది ఇప్పటిదాకా రికార్డు.