జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌.. ప్ర‌భుత్వ చేతికి మ‌ట్టి అంట‌లేదుగా!

‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు. అయితే.. ఈ నిధుల్లో ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా కేటాయించిన సొమ్ములు ఏమైనా ఉన్నాయా? అంటే.. లేవు. వివిధ సామాజిక వ‌ర్గాల సంక్షేమం కోసం.. కేటాయించే నిధుల‌నే గుండుగుత్తుగా చూపించి.. వీటినే విద్యాదీవెన కింద విడుద‌ల చేయ‌డం సీఎం జ‌గ‌న్ తెలివి తేట‌ల‌కు నిద‌ర్శ‌నం అంటున్నారు ప‌రిశీల‌కులు.

కాగా, విద్వాదీవెన ప్రారంభింస్తూ.. సీఎం ఏమ‌న్నారంటే.. విద్యా దీవెన ద్వారా 10.88లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతుందన్నారు. “2018-19లో బకాయిలు ఉన్న రూ.1800 కోట్లను మన ప్రభుత్వమే చెల్లించింది. 2019-20 ఏడాదికి పూర్తి రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేకుండా చేశాం. ఏ ఏడాది ఫీజు రియింబర్స్‌మెంట్‌ను అదే ఏడాదిలో చెల్లిస్తున్నాం. నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తున్నాం” అన్నారు.

ఈ సారి .. ప్రతి త్రైమాసికంలో నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామ‌ని సీఎం చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీలుగా మార్చామ‌ని, నాడు-నేడుతో స్కూళ్ల రూపురేఖలను మార్చుతున్నామ‌ని, పిల్లల ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా ఉంద‌ని వెల్ల‌డించారు. పిల్లల తల్లులకు ప్రభుత్వం తరఫున లేఖలు కూడా రాశామ‌ని, వసతి దీవెన కూడా ఎప్పుడు ఇస్తామన్నది లేఖలో రాశామని సీఎం ‌జగన్‌ పేర్కొన్నారు. మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు.

ఇవీ.. నిధులు..

  • బీసీ సంక్షేమ శాఖ: రూ.491.42 కోట్లు (బీసీ విద్యార్థులతో పాటు ఈబీసీ, కాపు విద్యార్థులకు)
  • ఎస్సీ సంక్షేమ శాఖ రూ. 119.25 కోట్లు (ఎస్సీ విద్యార్థుల కోసం )
  • ఎస్టీ సంక్షేమ శాఖ రూ.19.10 కోట్లు(ఎస్టీ విద్యార్థుల కోసం)
  • మైనారిటీ సంక్షేమ శాఖ రూ.41.68 కోట్లు(మైనార్టీ విద్యార్థుల కోసం)
    వాస్త‌వానికి ఈ నిధులు వ్య‌క్తిగ‌తంగా ఆయా శాఖ‌ల ద్వారా ఆయా సామాజిక వ‌ర్గాల అభ్యున్న‌తికి వెచ్చించాలి. కానీ, ఇప్పుడు ప్ర‌భుత్వం వీటినే విద్యాదీవెన కింద జ‌మ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంటే.. ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేకంగా ఆయా శాఖ‌లకు కేటాయించిన నిధులు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై కూడా సీఎం జ‌గ‌న్ వివ‌రించి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.