కార్తీక దీపం సీరియల్‌పై దర్శకుడి కామెడీ

కార్తీక దీపం.. తెలుగు టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సీరియల్. మా టీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్‌‌కు అదిరిపోయే స్థాయిలో వ్యూయర్ షిప్ ఉంది. ఈ సీరియల్ ప్రసార సమయానికి ఇళ్లలో మహిళలు టీవీల ముందు కూలబడిపోతారు. సీరియల్ అయిపోయాక మళ్లీ ఎపిసోడ్ వచ్చే వరకు దీని మీద చర్చలు నడుస్తుంటాయి.

డాక్టర్ బాబు (కార్తీక్), వంటలక్క (దీప) చాలా మంది ఇళ్లలో కుటుంబ సభ్యుల్లా మారిపోయారంటే అతిశయోక్తి కాదు. తన భార్య అయిన వంటలక్కను అపార్థం చేసుకుని ఆమెను దూరం పెడతాడు డాక్టర్ బాబు. వీళ్ల మధ్యలోకి మోనిత అనే మూడో మనిషి వస్తుంది. ఆమె డాక్టర్ బాబుకు దగ్గరవడానికి ప్రయత్నిస్తుంది. చాలా ఏళ్లుగా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది. కథ కాస్తయినా ముందుకు కదలకుండా స్ట్రక్ అయిపోయినా సరే.. ఈ సీరియల్ అంటే ప్రేక్షకులు పడిచస్తారు. ముఖ్యంగా మహిళలు ఈ సీరియల్ విషయంలో చాలా ఎమోషనల్ అవుతుంటారు.

ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఈ సీరియల్ మీద బోలెడంత కామెడీ నడుస్తుంటుంది. లాక్ డౌన్ టైంలో ఈ సీరియల్ రాకపోవడంతో టీవీ ప్రేక్షకులు వంటలక్కను ఎంతగా మిస్సవుతుంటారో అంటూ కామెడీ చేస్తున్నారు నెటిజన్లు. వంటలక్క కనిపించడం లేదంటూ మీమ్స్ కూడా వేస్తున్నారు.

‘హిట్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శైలేష్ కొలను కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఈ సీరియల్ మీద కామెడీ చేశాడు. తన తల్లితో కార్తీక దీపం సీరియల్ గురించి చర్చిస్తున్న వీడియోను అతను ఈ రోజు ట్విట్టర్లో షేర్ చేశాడు.

సీరియల్లో డాక్టర్ బాబు దీపను వదిలిపెట్టి చక్కగా మోనితతో సెటిలైపోతే బాగుంటుందని శైలేష్ అంటే.. అతడి తల్లి చాలా సీరియస్ అవుతూ, అదే జరిగితే సీరియల్ డైరెక్టర్‌ను వెంటాడి కొడతారని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. వీడియో సంగతి ఆమెకు తెలియనట్లే ఉంది. సీరియల్ విషయంలో చాలామంది మహిళల లాగే ఆమె కూడా ఎమోషనల్ అని అర్థమవుతోంది.