తిరుప‌తిలో ప‌న‌బాక ఫైట్‌.. ప్ల‌స్‌లు.. మైన‌స్‌లు ఇవే!

తిరుప‌తి పార్ల‌మెంటు స్థానం ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున పోటీకి సిద్ధ‌మైన కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి.. వైసీపీ ధాటికి నిలిచి గెలుస్తారా? ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ప‌న‌బాక దూకుడు ఏమేర‌కు ప‌నిచేస్తుంది? గ‌త ప‌రిచ‌యాలు.. అనుభ‌వాల‌ను.. రంగ‌రించి.. వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతారా? అనే విష‌యాలు ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. 2019 ఎన్నిక‌ల్లో ఇదే స్థానం నుంచి ప‌న‌బాక టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప‌న‌బాక ల‌క్ష్మికి ప‌డిన ఓట్లు 4,94,501. ఇక‌, ఇక్క‌డ నుంచి అప్ప‌ట్లో విజ‌యం సాధించిన వైసీపీ స‌భ్యుడు బ‌ల్లి దుర్గా ప్ర‌సాద‌రావుకు 7,22,877 ఓట్లు ల‌భించాయి. అంటే.. ఇద్ద‌రి మ‌ధ్య కూడా రెండు ల‌క్ష‌ల ఓట్ల తేడా ఉంది.

నిజానికి అప్ప‌టికి జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీకి రెండు ల‌క్ష‌ల మెజారిటీ ల‌భించింది. ఇక‌, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. పైగా సంక్షేమం పేరుతో హ‌డావుడి చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు త‌మ‌వైపే ఉన్నార‌ని.. ఇప్ప‌టికే వైసీపీ నాయ‌కులు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ఈ ద‌ఫా మెజారిటీ 3 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంటుంద‌ని కూడా చెప్పుకొచ్చారు. దీనిని బ‌ట్టి.. వైసీపీ వ్యూహాలు చాలా ప‌టిష్టంగా ఉన్నాయ‌నే విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన తిరుప‌తి మునిసిపాలిటీ ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం స‌హా అన్నింటినీ త‌న ఖాతాలో వేసుకుంది. తిరుప‌తి ఎమ్మెల్యే కూడా వైసీపీ నాయకుడే. ఇలా.. అనేక విధాల వైసీపీకి క‌లిసి వ‌స్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో తిరుప‌తి పార్ల‌మెంటును ప‌న‌బాక ద‌క్కించుకునేందుకు క‌ఠోర శ్ర‌మ‌ప‌డాల్సిందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ్ముళ్లు క‌లిసి రాక‌పోవ‌డం ప్ర‌ధానంగా ప‌న‌బాక‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి క‌ల్పించింది. అయితే.. ఇప్పుడు వారిని క‌లుపుకొని పోయేందుకు ప‌న‌బాక వ్యూహాత్మ‌కంగా పావులు క‌ద‌పాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే.. స్తానికంలో ఓట‌మితో టీడీపీ శ్రేణులు డీలా ప‌డ్డాయి. మ‌రో నెల రోజుల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఖ‌చ్చితంగా ఏప్రిల్ 17న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో మొత్తంగా చూస్తే.. 28 రోజ‌లు గ‌డువు మాత్రమే మిగిలి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ముందుకు న‌డ‌వాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది.

మ‌రోవైపు పార్టీ అధిష్టానం కూడా సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అంటే.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌క‌త్వాన్ని ముందుకు న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంది. అవ‌స‌ర‌మైతే.. ఇంటింటికీ ప్ర‌చారం ముమ్మ‌రం చేయ‌డం, ప్ర‌తి ఒక్క‌రికీ విధాన‌ప‌ర‌మైన‌.. అవ‌గాహ‌న క‌ల్పించ‌డం వంటివి ఇప్ప‌టి నుంచే ప్రారంభించాలి. అదేస‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు, ముఖ్యంగా పార్టీ అధిష్టానం.. వేసే ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌క‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

అభ్య‌ర్థిని ముందుగానే ఖ‌రారు చేయ‌డం వ‌ల్ల‌.. పార్టీలో సీటుపై ఇబ్బందులు ఉండ‌వ‌న్నే ఆలోచ‌న మంచిదే అయినా.. ప్ర‌చార పర్వంలో ఇది ప్ర‌ధాన భూమిక పోషిస్తుంది. సో.. అసంతృప్తుల‌ను కూడా దారిప‌ట్టించి.. ప్ర‌చారంలోకి దింపాల్సిన అవ‌స‌రం ఉంది. సోష‌ల్ మీడియా ప్ర‌చారం.. స్థానిక ఎన్నిక‌ల్లో ఓటమి ద్వారా ల‌భించిన సానుభూతిని ఇక్క‌డ ఉప‌యోగించుకునే చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.